పవన్ కళ్యాణ్ రూటు ఎటు - వైసీపీకి కావాల్సింది అదే : తేల్చేసినట్లేనా..!!
ఏపీలో జనసేనాని చుట్టూ పొత్తు రాజకీయాలు తిరుగుతున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ పవన్ చేసిన వ్యాఖ్యల సమయం నుంచి పవన్ పొత్తుల విషయంలో ఏం మాట్లాడినా సంచలనంగా మారుతోంది. పార్టీ సమావేశంలో పొత్తుల పైన మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పర్చూరు సభలో మరోసారి పొత్తుల పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటు వైసీపీ మాత్రం పవన్ కళ్యాణ్ తొలి నుంచి టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారని..వచ్చే ఎన్నికల్లోనూ ఇద్దరూ కలిసే పోటీ చేస్తారని పదే పదే చెబుతోంది. పవన్ - చంద్రబాబు కు దైర్యం ఉంటే పొత్తు లేకుండా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు.

పవన్ పై వైసీపీ వ్యూహాత్మక ఉచ్చు
అదే సమయంలో జనసైనికులను చంద్రబాబు పల్లకి మోయమని పవన్ చెబుతున్నారంటూ పరోక్షంగా జనసైనికులను ప్రభావితం చేసే విధంగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు పర్చూరు సభలో పవన్ మరోసారి కీలక కామెంట్స్ చేసారు. పొత్తుల పైన తాను ఇప్పుడు మాట్లాడనని చెబుతూనే... తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని..ఎవరితోనూ ఉండదని చెప్పుకొచ్చారు. దీని ద్వారా తాను పొత్తుల కోసం ఎదురు చూడటం లేదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసారు. దీంతో పాటుగా టీడీపీ తగ్గాలని చెప్పిన పవన్..తాజా వ్యాఖ్యలతో టీడీపీ పైన పరోక్షంగా ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తు అవసరమనే అభిప్రాయం టీడీపీలో ఉన్నా.. పవన్ షరతులకు అంగీకరించటానికి మాత్రం టీడీపీ సిద్దంగా లేదని ఆ పార్టీ నేతలే అంతర్గత చర్చల్లో స్పష్టం చేస్తున్నారు.

పవన్ వ్యాఖ్యలతో డైలమా
కానీ, జనసేన అధినేత ఆలోచనలు మాత్రం ఈ సారి భిన్నంగా కనిపిస్తున్నాయి. 2014లో మద్దతు.. 2019లో ఒంటరి పోరు చేసిన తాను..ఈ సారి బలం చాటుకోవలనే ఆలోచనతో ఉన్నారు. పార్టీ నేతలు..అభిమానులు సైం పవన్ పొత్తు పెట్టుకుంటే...సీట్లు -అధికారం విషయంలో గట్టిగా పట్టుబట్టాలని కోరుతున్నారు. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే అందుకు సైతం సిద్దం కావాలనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. ఇక, వైసీపీ కోరుకుంటుంటోంది అదే. ఎవరు పొత్తులు కట్టినా ..తాము మాత్రం సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతామని నేతలు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల పర్యటనలతో ఏడాది పాటు ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు.

వేచి చూస్తున్న టీడీపీ .. బీజేపీ మాత్రం నో
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన టీడీపీ ఎక్కడా ఏ రకంగానూ స్పందించటం లేదు. వైసీపీ లక్ష్యంగానే అడుగులు వేస్తోంది. కానీ, జనసేన మాత్రం ఇంకా పొత్తుల పైన స్పష్టమైన నిర్ణయానికి రాలేదనే అంశం అర్దం అవుతోంది. పవన్ చేస్తున్న వ్యాఖ్యల పైన స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని నిలదీసారు. టీడీపీతో కలిసే ఉండటంతో తాము దత్తపుత్రుడు అంటున్నామని.. టీడీపీతో సంబంధం లేదని చెబితే దత్తపుత్రుడు అని తాము అనబోమని స్పష్టం చేసారు. దసరా నుంచి పవన్ కళ్యాణ్ సైతం బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. బీజీపీతో కొనసాగుతన్నామని చెబుతున్నా..అది నామమాత్రంగా వారి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయనే అభిప్రాయం ఉంది. టీడీపీతో జత కట్టేందుకు బీజేపీ సిద్దంగా లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తాయా..లేక కలుస్తాయా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ, పర్చూరు సభలో పవన్ వ్యాఖ్యలతో పొత్తుల పైన డైలమా కొనసాగుతుందనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications