బాబు నచ్చారు: జెపికి పవన్ ఝలక్, ప్రచారంపై దాటవేత
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం ట్విస్ట్ ఇచ్చారు. పవన్ ఆహ్వానం మేరకు టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వెళ్లారు. భేటీ అనంతరం ఇరువురు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుతో కలిసి ప్రచారం చేసే విషయమై పవన్ దాటవేశారు. పరిస్థితులను బట్టి తాము నిర్ణయించుకుంటామని చెప్పారు. విభజనలో కాంగ్రెసు విధానం తనను బాధించిందని చెప్పారు.
ఓట్లు చీల్చకూడదనే తాను పోటీ చేయడం లేదన్నారు. పార్టీ నిర్మాణం పైన దృష్టి సారిస్తానని చెప్పారు. రెండు ప్రాంతాల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించారు. టిడిపి-బిజెపి మంచి కాంబినేషన్ అన్నారు. ఎన్డీయే గెలుపుతో దేశంలో అభివృద్ధి సాధ్యమన్నారు. రెండు రాష్ట్రాల్లోను ఎన్డీయేను గెలిపిస్తేనే సాధ్యమన్నారు. ఓ వ్యక్తికి టిక్కెట్ ఇవ్వలేదని చెప్పి తాను టిడిపి-బిజెపి కూటమికి మద్దతిచ్చే విషమయై వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని పొట్లూరి వర ప్రసాద్ను ఉద్దేశించి అన్నారు.
పివిపి కోసం కాదని... బెజవాడ సీటుపై ఏది మంచిది అయితే అదే చేయాలని తాను చంద్రబాబుకు సూచించానని చెప్పారు. కెసిఆర్ అమర్యాదగా మాట్లాడుతున్నారని, ఆయన వైఖరితో తెలంగాణ ప్రాంతానికి నష్టమన్నారు. విద్యావంతుడు అయిన దాసోజు శ్రవణ్ను అవమానించారని కెసిఆర్ పైన నిప్పులు చెరిగారు. ఒకప్పుడు సోనియాను దేవత అని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు బలిదేవత అంటున్నారని, పదే పదే మాట మార్చితే లాభమేమిటన్నారు.
తెరాసకు ఓటేస్తే అభివృద్ధి జరగదన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బిసిని ముఖ్యమంత్రి చేస్తామన్న చంద్రబాబు నిర్ణయం నచ్చిందన్నారు. చంద్రబాబు అంటే తనకు ఇష్టమని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన నిర్ణయాలు తెలంగాణ ప్రజలను బాధించాయన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మోడీ ఒక్కరే తనకు నాయకుడిగా కనిపిస్తున్నారని చెప్పారు.
జెపికి ఝలక్
మల్కాజిగిరి లోకసభ బరిలో నిలిచిన లోక్సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణకు పవన్ ఝలక్ ఇచ్చారు. జెపి మంచి వ్యక్తి అని, ఆయన అంటే గౌరవం ఉందన్నారు. అయితే పొత్తు ధర్మం కారణంగా తాను మల్కాజిగిరిలో జెపి తరఫున పోటీ చేయడం లేదని చెప్పారు. టిడిపి, బిజెపి కూటమికే తన మద్దతు అన్నారు. కొత్త రాష్ట్రాలుగా విడిపోతున్నందున అనుభవజ్ఞులు కావాలని చెప్పారు. మోడ పట్ల తెరాస నేతలు అమర్యాదగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.