ఉత్తరాంధ్రను గాలికొదిలేశారు, మంచినీళ్లు లేని ఊళ్లల్లో మద్యమా?: బాబుపై పవన్ ఫైర్
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలు విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇక్కడ అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు.
అందుకే వచ్చా..
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పవన్ తన పోరాట యాత్రలో భాగంగా గురువారం పర్యటించారు. 90శాతం మంది గిరిజనులు ఉన్న కురుపాం నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకోవడానికే వచ్చానని చెప్పారు.
టీడీపీ సర్కారు పట్టించుకోవడం లేదు
గిరిజనులు, సామాన్యుల సమస్యలను టీడీపీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని భావించానని, కానీ, ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని పవన్ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్రం మొండిచేయి చూపిందని అన్నారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే గిరిజనుల వద్దకు రాజకీయ పార్టీలు వస్తున్నాయని అన్నారు.
మహానాడులో మంచినీళ్లలా డబ్బు..
టీడీపీ మహానాడు కోసం మంచినీళ్లలా డబ్బును ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. పూర్ణపాడు లేబేసు వంతెనను నిర్మించలేకపోతోందని పవన్ విమర్శించారు. కురుపాంలో కనీస వైద్య సదుపాయాలు కూడా లేవని మండిపడ్డారు.
Recommended Video
మంచినీళ్లు లేని ఊళ్లల్లో మద్యం..
కేవలం ముఖ్యమంత్రి తిరగడానికి మాత్రమే రోడ్డు వేసుకుంటున్నారని విమర్శించారు. మంచినీళ్లు వెళ్లలేని ప్రాంతాలకు కూడా కూల్ డ్రింక్స్, మద్యం ఎలా వెళ్తొందని పవన్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకుకాళం, విజయనగరం జిల్లాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో కళింగ ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పవన్ వ్యాఖ్యానించారు.