హోదాపై పవన్ కల్యాణ్ యూటర్న్: బాబు, కేసీఆర్లకు మార్కులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. ఆయన ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సంచలన రేపుతోందంటూ సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రత్యేక హోదా కోసం తాను ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని ఆయన గుంటూరు జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదని ఆయన ఇప్పుడు అన్నారు.
నిధులు రావడమే ముఖ్యం
కేంద్రం నుంచి నిధులు రావడమే ఇప్పుడు ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మాటల వెనక బిజెపి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
ముఖ్యమంత్రులకు మార్కులు..
అదే జాతీయ చానెల్ ఇంటర్వ్యూలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పవన్ కల్యాణ్ మార్కులు వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఆయన ఎక్కువ మార్లు వేశారు.
ఇలా మార్కులు వేశారు...
పది మార్కులకు ఏ ముఖ్యమంత్రికి ఎన్ని మార్కులు వేస్తారని చానెల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేసీఆర్కు ఆరు మార్కులు, చంద్రబాబుకు రెండున్నర మార్కులు వేస్తానని పవన్ కల్యాణ్ జవాబిచ్చారు. కేసిఆర్ తలపెట్టిన థర్డ్ ఫ్రంట్ ఏర్పాటును ఆయన ఇటీవల బలపరిచిన విషయం తెలిసిందే.
బిజెపితో వెళ్లబోమని....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని అడుగుతున్నట్లు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు బిజెపితో కలిసి వెళ్లే ప్రసక్తి ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఆయన చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నారా లోకేష్ అవినీతిపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
వారిద్దరి మధ్య పాతకక్షలేవో....
ప్రధాని నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మధ్య పాతకక్షలు ఏవో ఉన్నట్లున్నాయని పవన్ కల్యాణ్ ఓ జాతీయ చానెల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరి మధ్య విభేదాల వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన అన్నారు
అ విషయం నాకు తెలియదా...
తాను ఎన్డిఎ భాగస్వామిని అని ఏం జరుగుతుందో తనకు తెలియదా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కేంద్రం రంగంలోకి దిగి పోలవరంలో ఏం జరుగుతుందో చూడాలని ఆయన కోరారు. తనను బిజెపి నడిపిస్తుందనే మాటలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.