నాకే ఇంతుంటే జగన్కెంత ఉండాలి, అదీ ఓ పుట్టుకేనా, ఛీ.. సిగ్గులేదా: టీడీపీపై పవన్ తీవ్రవ్యాఖ్యలు
కాకినాడ: తెలుగుదేశం పార్టీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజానగరం బహిరంగ సభలో దుమ్మెత్తిపోశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన శతఘ్ని తన సోషల్ మీడియా వేదికలో పోస్టు చేసింది. టీడీపీ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై తనకే ఇంత దమ్ము ఉంటే జగన్కు ఎంత ఉండాలని కూడా నిలదీశారు.
చంద్రబాబు చాలా తెలివైనవారు: కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్కు బొత్స గట్టి కౌంటర్
నాది ఒకటే మాట, ఒకటే బాణం అని, గురిపెట్టి కొడితే బద్దలు కావాల్సిందే అని పవన్ అన్నారు. ఎవరైతే మనలను తన్నించారో (కాంగ్రెస్) వారికే టీడీపీ నాయకులు గులాంగిరి చేస్తున్నారని అన్నారు.
మీది ఓ పుట్టుకేనా, ఛీ.. సిగ్గులేదా?
తెలుగుదేశం పార్టీ నేతలకు నేను ఒకటే చెబుతున్నానని, మీరు సిగ్గు, లజ్జ, పౌరుషం మరిచిపోయారని, ఏం పుట్టుక అది, అలాంటి పుట్టుక ఓ పుట్టుకేనా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీ ఎంపీలను తిడితే మీకు సిగ్గులేదు.. ఛీ అని దుయ్యబట్టారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పార్లమెంటులో చితక్కొడితే పౌరుషం లేదా, సిగ్గులేదా అని ధ్వజమెత్తారు. అదే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఎక్కడో బ్రిటిష్ వాడు ఓ మాట మాట్లాడితే, ఛాతి తీసి, కాల్చు బే అన్నారు, మీకు అంత సిగ్గులేదా, ఆంధ్రకేసరిలా పౌరుషం లేదా అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు వారసులు కాదా అని నిలదీశారు. పొట్టి శ్రీరాములు 56 రోజులు నిరాహార దీక్ష చేసి సంపాదించుకున్న ఈ రాష్ట్రాన్ని ఉత్తర భారతీయ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు తాకట్టు పెడతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వరు, అడ్డగోలుగా విభజించారని చెప్పారు. ఈ పౌరుషం లేని టీడీపీ వల్ల మన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పారు. అందుకే టీడీపీని సమూలంగా ఏపీ నుంచి తరిమేద్దామన్నారు. జనసేన పార్టీ లేకుంటే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు.
జగన్! నాకే ఇంత దమ్ము ఉంటే, నీకెంత ఉండాలి
జనసేన సహకారం తీసుకొని, ఈ రోజు మనలను తొక్కేస్తున్నారని పవన్ నిప్పులు చెరిగారు. రైతులను జైళ్లలో పెట్టిస్తున్నారని చెప్పారు. వీటిని జగన్ నిలదీయడం లేదన్నారు. ఆయన ఎంతసేపు రోడ్లపై నడిచి.. నడిచి.. ఓదార్పు యాత్ర చేయడం తప్ప, నిజమైన ఓదార్పు యాత్ర చేయడం లేదన్నారు. అసెంబ్లీకి వెళ్లి నిలదీయాలన్నారు. పవన్కు ఓ ఎమ్మెల్యే, ఎంపీ లేడని చెప్పారు. మేం సమస్యలపై నిలదీయడం లేదా అన్నారు. మేం పోరాటాలు చేయడం లేదా, ప్రతి సమస్యకు పరిష్కారం తీసుకు రావడం లేదా అన్నారు. నాకే ఇంత దమ్ము ఉంటే.. వైయస్ ముఖ్యమంత్రిగా పనిచేశారని, జగన్ ప్రతిపక్ష నేత అని, ఆయన ఎన్ని సమస్యలు పరిష్కరించాలని అభిప్రాయపడ్డారు. కానీ మీకు చిత్తశుద్ధి లేదన్నారు. రాజకీయాలను వ్యాపారంగా చూసేవారు మనకు అవసరం లేదన్నారు.
జగన్, చంద్రబాబులకు తోలు మందం అయింది
రాజమండ్రిలో పదిలక్షల మంది కవాతు చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వారు మార్పు కోసమే వచ్చారని చెప్పారు. అవినీతి అంతమొందించాలనే ఉద్దేశ్యంతో వారు వచ్చారని చెప్పారు. దోపిడీదారులను చొక్కాపట్టుకొని నిలదీసే జెండా జనసేన జెండా అన్నారు. శాంతిని నెలకొల్పాలంటే కూడా కత్తి అండ కావాల్సిన రోజు అని కవి శివారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు, జగన్, లోకేష్లకు గాంధీ గారి పద్ధతిలో చెబితే మాటలు అర్థం కావని, వాళ్లకు తోలు మందం అయిందని, వారికి కవాతు వంటి బలప్రదర్శన ద్వారా వినిపించగలమని చెప్పారు. అవినీతిని అడ్డంగా పెంచేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త, అవినీతిని బద్దలు కొడతామని హెచ్చరించారు.
నేను ఒకటే మాట ఇస్తున్నా
వైద్య, విద్యా వ్యవస్థలను ప్రభుత్వం నడపాలని, కానీ వాటిని నారాయణ వంటి వారికి ఇస్తారని, కార్పోరేట్ వారు నడుపుతారని పవన్ మండిపడ్డారు. కానీ లిక్కర్ మాత్రం చంద్రబాబు, లోకేష్లు నడుపుతారని చెప్పారు. ఎందుకంటే వారి నాయకులకు, వారికి డబ్బులు వస్తాయన్నారు. మన ఆరోగ్యాలను దెబ్బతీసి, కుటుంబాలను చిన్నాభిన్నం చేసి ఎదుగుతున్నారని చెప్పారు. ఆడపడుచులు బాధ్యత తీసుకుంటే అంచెలవారిగా మీ నియోజకవర్గాల పరిధిలో ఒక్క బ్రాండీ షాప్, లిక్కర్ షాప్ లేకుండా నడిపించే బాధ్యత తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు. తాగేసి ఆడపిల్లలను ఏడిపిస్తే తోలు తీస్తామన్నారు. తాగితే ఇంట్లో మూలన కూర్చోవాలని, రోడ్లపై పిచ్చి వేషాలు వేస్తే మాత్రం జైల్లో పెట్టిస్తామన్నారు.
మానవత్వమే నా మతం
మందిరాలు, చర్చిలు, మసీదుల వద్ద బ్రాండీ షాపులు పెడితే ఒక్కరూ అడగడం లేదని, జగన్ కూడా చెప్పడం లేదని, ఆయన బైబిల్ పట్టుకొని తిరుగుతారని, కానీ బ్రాందీ షాపుల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నేను అన్ని మతాలను, కులాలను, ప్రాంతాలను సమానంగా చూస్తానని చెప్పారు. తనకు కులం, మతం, ప్రాంతం లేదని చెప్పారు. మానవత్వమే తన మతమని చెప్పారు.