వైసీపీలోని కాపు నేతలే పవన్ కల్యాణ్ టార్గెట్?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రమైన 'విషయం' ఒకటుంది. బహుశా తెలంగాణ మినహా ఇతర ఏ రాష్ట్రంలోను ఇటువంటి 'విషయం' మనకు కనపడకపోవచ్చు.. లేదంటే రాజకీయ పార్టీలన్నీ సాధారణంగా అనుసరించే వ్యూహమైనా కావచ్చు. ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతను విమర్శించాలంటే ప్రత్యర్థి పార్టీ తన పార్టీలోని అదే సామాజికవర్గానికి చెందిన నేతతో విమర్శలు చేయిస్తుంది. తెలుగుదేశం కావచ్చు.. వైసీపీ కావచ్చు.. జనసేన కావచ్చు.. పార్టీ ఏదైనా సందర్భం మాత్రం ఒకటే అవుతోంది.

ఏ వర్గానికి చెందినవారు ఆ వర్గంపై..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలను తిట్టించాలంటే.. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ పై పదునైన వాగ్బాణాలు సంధించాలంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ ముందంజలో ఉంటారు. అలాగే వపన్ కల్యాణ్ పై విమర్శలు ఎక్కుపెట్టాలంటే కాపు సామాజికవర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ తదితరులుంటారు. ఏ వర్గానికి చెందినవారు ఆ వర్గానికి చెందిన నేతలపై విరుచుకుపడుతుంటారు. ఇరుపార్టీల్లోను ఇదే పరిస్థితి.

బంతి, చామంతి అంటూ విరుచుకుపడ్డ పవన్
పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా ఎంచుకొని పదే పదే జనసేనపై విరుచుకుపడుతున్న కాపు నాయకులను ఈసారి ఎన్నికల్లో ఓడించాలన్నదే పవన్ లక్ష్యంగా ఉంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చెప్పు చూపిస్తూ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. బంతి, చామంతి, పూబంతి అంటూ ప్రాస పదాలు వాడారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ తదితరులపై విరుచుకుపడ్డారు.

వైసీపీలో ఉన్న కాపు నేతలకు..
టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరితే ఈ కాపు నేతలందరికీ ఇబ్బంది తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య ఓట్లు చీలడంవల్లే కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు గెలిచారని, ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే వైసీపీలో ఉన్న కాపు నేతలకు రిస్క్ ఎక్కువగా ఉందంటున్నారు. కన్నబాబు, గ్రంథి శ్రీనివాస్ తదితరులపై కూడా పొత్తు ప్రభావం పడుతుందంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈసారి పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఎంచుకున్న నేతలంతా గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలను అవలంబించాల్సిన పరిస్థితి తలెత్తబోతోంది.












Click it and Unblock the Notifications