సభ తర్వాత థ్యాంక్స్ చెప్పిన పవన్, ఎమ్మెల్యేగా.. గందరగోళంలో పడేశారు!
అనంతపురం: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా అనంతపురం పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. సీమాంధ్ర హక్కుల చైతన్య సభ అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన విషయం తెలిసిందే.
ఈ సభ ప్రశాంతంగా సాగింది. ఈ నేపథ్యంలో సభ అనంతరం పవన్ ట్వీట్ చేశారు. అనంతపురం పోలీసుల అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని పవన్ పేర్కొన్నారు. పబ్లిక్ మీటింగ్ ప్రశాంతంగా కొనసాగిందని పేర్కొన్నారు.
పవన్ పోటీపై మరోసారి చర్చ
జనసేన పార్టీ అధినేత పవన్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఏలూరులో తన ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని నిర్ణయించారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారని భావించారు.
తాజాగా, అనంతపురంలో జరిగిన సభలో మాట్లాడారు. తాను అనంత సమస్యల గురించి పోరాడుతానని, హైదరాబాద్ తర్వాత.. ఏపీలోని అనంతలోనే తొలి జనసేన కార్యాలయం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కరువు, సమస్యలు ఉన్న అనంత జిల్లా సమస్యలను ఢిల్లీ దాకా తీసుకు వెళ్తానని చెప్పారు.
ఇదీ జనసేన, అపాయింట్మెంట్ కోరా.. మోడీకైనా ఎదురైళ్తా: కొత్తగా పవన్, సైటొచ్చింది
తన ప్రసంగంలో పదేపదే అనంతపురం జిల్లాను ప్రస్తావించారు. జిల్లాకు చెందిన తరిమెల నాగిరెడ్డి పేరు ప్రస్తావిస్తూ.. ప్రత్యేక హోదా అంశం కంటే ఎక్కువగా అనంత రైతుల కష్టాలనే ప్రస్తావించారు. ఈ సభలో పవన్ ప్రసంగం విన్నవారు ఆయన అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తారని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా నుంచి పోటీచేస్తే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి నష్టం, ఎవరికి లాభం.. అన్న కోణంలోనూ రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. మరోవైపు, సొంత జిల్లా ఏలూరు నుంచి పోటీ చేస్తారా లేక అనంత నుంచి పోటీ చేస్తారా అనే విషయం తేలడం లేదని, పవన్ గందరగోళంలో పడేసారని అంటున్నారు. అయితే అనంత నుంచి పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయంటున్నారు.