తమిళనాడులో తెలుగు కోసం పవన్ కళ్యాణ్ ఫైట్
చెన్నై: తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణకు జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. తమిళనాడు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెలాఖరున ధర్నా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తమిళనాడులో తెలుగు భాషా పరిరక్షణకు తెలుగు ప్రజలు ఇప్పటికే ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.
తమిళనాడు ప్రభుత్వం 2006లో ప్రవేశపెట్టిన ‘నిర్బంధ తమిళం' జీవో కారణంగా మైనారిటీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునేందుకు అవకాశం లేకుండాపోయిన విషయం తెలిసిందే. తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేపట్టింది. ఇటీవల హైదరాబాద్లో నిరసన దీక్ష కూడా నిర్వహించింది.
ఈ నేపథ్యంలో సమస్యపై పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లు సమాచారం. తమిళనాడులోని తెలుగువారికి సంఘీభావం తెలుపుతూ ఈ నెలాఖరులోపు హోసూరులో ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా తెలుగు భాషను పరిరక్షించాలన్న డిమాండ్తోనే నిరసనదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.