చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కు ప్రత్యేక హోదా- తొలిసారి..!!
ఏపీ మంత్రివర్గం కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు..ఉప ముఖ్యమంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటంలో పవన్ కీలకంగా వ్యవహరించారు. కేంద్ర మంత్రివర్గంలోనూ జనసేన మంత్రి పదవికి దూరంగా ఉంది. ఇప్పుడు ఏపీ కేబినెట్ లో జనసేనకు మూడు పదవులు కేటాయించారు. బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది. ఇక..పవన్ చేపట్టే శాఖల పైన ఆసక్తి కర సమాచారం వెల్లడవుతోంది.
పవన్ కు ఏరికోరి
2014లో చంద్రబాబు మంత్రివర్గంలోనూ బీజేపీ భాగస్వామిగా ఉంది. జనసేన ఎన్నికల్లో మద్దతుకే పరిమితం అయింది. ఆ మంత్రివర్గంలో చంద్రబాబు కాపు, బీసీ వర్గాలకు రెండు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించారు. ఇప్పుడు జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ కు ఇచ్చే ప్రాధాన్యత గురించి అభిమానుల్లోనూ.. రాజకీయంగా చర్చ సాగుతోంది. ఈ సారి పవన్ కు చంద్రబాబు మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యత దక్కనుంది. అందులో భాగంగా కేవలం పవన్ కు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. మరెవరూ డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

శాఖల పై కసరత్తు
పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదాలో ఇచ్చే శాఖల పైన చర్చ జరిగింది. తొలి నుంచి పవన్ కు హోం శాఖ ఇస్తారనే వాదన ఉంది. అయితే, పవన్ మాత్రం వ్యవసాయ, పంచాయితీరాజ్ శాఖల నిర్వహణ పైన ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో ఎన్విరాన్ మెంట్ పైన పవన్ కు తొలి సారి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో...పవన్ కోరుకున్న విధంగా గ్రామీణ వ్యవస్థలో సమూల మార్పుల బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే హోం శాఖ పైన ఇంకా నిర్ణయం కాలేదని సమాచారం. పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచారంలో శాంతి భద్రతల తో పాటుగా గ్రామీణ వ్యవస్థ గురించి ఎక్కువగా స్పందించారు. శాంతి భద్రతలతో పాటుగా గ్రామీణ వ్యవస్థలో మార్పులు తెస్తామని హామీ ఇచ్చారు.

ఎవరికి ఏ శాఖ
దీంతో..పవన్ కు ఈ శాఖలతో పాటుగా నాదెండ్ల మనోహర్ కు రెవిన్యూ శాఖ అప్పగిస్తారని తెలుస్తోంది. అదే విధంగా కందుల దుర్గేష్ కు ఎక్సైజ్ లేదా రవాణా శాఖ ఇచ్చేలా చర్చలు జరిగినట్లు సమాచారం. బీజేపీ నుంచి మంత్రి అయిన సత్యకుమార్ కు దేవాదాయ శాఖ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ సారి రాజధాని..ఉపాధి కీలకం కావటంతో నారా లోకేష్ కు ఐటితో పాటుగా పరిశ్రమల శాఖ కేటాయిస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. నారాయణకు మున్సిపల్, పార్ధసారధికి విద్యాశాఖ..కొల్లు రవీంద్రకు బీసీ సంక్షేమం..అచ్చెన్నాయుడుకు విద్యుత్ శాఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్నాహ్నం తరువాత మంత్రుల శాఖల పైన అధికారికంగా నిర్ణయం వెలువడనుంది.












Click it and Unblock the Notifications