రాయపాటి కంపెనీ.. కేసు పెడతారా: బాబుకు పవన్, ఆర్కే బీచ్ హోదా ఫైట్కు మద్దతు
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలవరం, అమరావతి రైతుల అంశంపై మరోసారి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. జనసేన అధినేత ఆరు వరుస ట్వీట్లు పెట్టారు.
అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలవరం, అమరావతి రైతుల అంశంపై మరోసారి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. జనసేన అధినేత ఆరు వరుస ట్వీట్లు పెట్టారు.
ఆ తర్వాత రాత్రి హోదాకు మద్దతిస్తానని ట్వీట్లు చేశారు.ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ యువత ఈ నెల 26న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో మౌన నిరసన ప్రదర్శన చేస్తే తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. గణతంత్ర దినోత్సవాన నిరసన ప్రదర్శనలు చేపడుతున్నామంటూ.. ప్రత్యేక హోదా.. డిమాండ్లు.. అనే నినాదంతో కూడిన సందేశాలు ట్విట్టర్లో 'స్టూడెంట్స్ ఫర్ స్పెషల్స్టేటస్' పేరుతో వస్తున్నాయి.
జల్లికట్టు కోసం తమిళులు చేసినట్లు ఈ నెల 26న విశాఖలోని ఆర్కే బీచ్లో, విజయవాడలో బ్యారేజీ దిగువన, తిరుపతిలో ఎస్వీ విశ్వవిద్యాలయంలో నిరసన కార్యక్రమాలుంటాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ స్పందించారు.

ఎంతవరకు న్యాయమో చెప్పండి
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణా నది లంక భూముల రైతుల కన్నీరు ఏపీకి క్షేమం కాదని, పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డుగా మార్చడం ఎంత వరకు న్యాయమో ప్రజాప్రతినిధులు చెప్పాలన్నారు.

రాయపాటి కంపెనీ.. చంద్రబాబు దృష్టి పెట్టడం లేదేం
టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివ రావుకు చెందిన పోలవరం గుత్తేదారు కంపెనీ ట్రాన్ స్ట్రాయ్ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డుగా మారిస్తే ప్రజలు ఎలా ఆలోచిస్తారో అన్న వివేకం కూడా చూపకుంటే ప్రజాప్రతినిధులను ఏమనుకోవాలని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణ ప్రగతిపై నెలకోమారు సమీక్ష జరుపుతున్న చంద్రబాబు సర్కారు ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు.

కేసులు పెట్టి నోరు మూయిస్తారా.. పవన్ ఘాటుగా..
ఈ భూములు ఉన్న రైతులు తమ వారు కాదనా లేక కాంట్రాక్టరుకు ఇబ్బంది అనా.. గత్యంతరం లేని రైతులు తగిన నష్టపరిహారం చెల్లించమని అడిగితే వారి మొర ఎందుకు వినరని పవన్ ప్రశ్నించారు. పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారని, ఇది అన్యాయం అని అడిగితే పోలీసులతో కేసులు పెట్టించి నోరు మూయిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది మంచిది కాదని, ఇకనైనా వారికి న్యాయం చేయాలన్నారు.

అందుకే నష్టపరిహారం చెల్లింపులో వివక్షనా..
అమరావతిలో కృష్ణానది లంక భూముల రైతుల బాధను సమాజ వికాసాన్ని కాంక్షించే వారు అర్థం చేసుకోవాల్సి ఉందని, తాము దళితులం అయినందువల్లే నష్టపరిహారం చెల్లింపులో వివక్షకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఇది సరికాదని పవన్ అన్నారు.

అసలు నిర్మాణాలే చేపట్టవద్దు.. పాయింట్ లాగిన పవన్
అసలు గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధలన ప్రకారం నది పరివాహకంలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకుందో లేదో స్పష్టత లేదని పవన్ పేర్కొన్నారు. ఈ భూములను తీసుకొని ఏం చేస్తారో ముందుగా ప్రజలకు లేదా కనీసం రైతులకైనా తెలియాలన్నారు.

ఇదీ జనసేన డిమాండ్
సేకరణకు ముందు ఎంత మేరకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో, అంత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పట్టా రైతులకు ఒకలా, లంక భూముల రైతులకు మరోలా వివక్ష సరికాదన్నారు. ఒకవేళ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకుంటే వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలేయాలని జనసేన డిమాండ్ చేస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications