రాజధాని రైతుల్ని కేంద్రమే ఆదుకోవాలి.. బీజేపీ, కాంగ్రెస్ తమ స్టాండ్ను వెల్లడించాలి.. జనసేనాని పవన్
ఏపీ రాజధానిని తరలించబోతున్నట్లు వైసీపీ ప్రభుత్వం సంకేతాలివ్వడంతో అమరావతి రైతులు తీవ్ర ఆందోళనకు గురై ఉద్యమాలు చేస్తున్నారని, ఈ దశలో కేంద్ర ప్రభుత్వమే రైతుల్ని ఆదుకోవాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రం జోక్యానికి అవకాశముందని, ఆ మేరకు మోదీ పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన కోరారు.

ఎందాకైనా రెడీ..
దాదాపు పాతిక రోజులుగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులు.. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ రైతుల ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, రైతుల కోసం తాను ఎందాకైనా పోరాడుతానని భరోసా ఇచ్చారు.

బాధగా ఉంది..
అమరావతి రైతులకు అన్యాయం జరిగిందనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోందని పవన్ గుర్తుచేశారు. రాష్ట్రం కోసం మూడు పంటలు పండే భూముల్ని ఇచ్చిన రైతులు.. ఇప్పుడు కుటుంబాలతో సహా రోడ్ల మీదికి రావడం చూస్తే బాధగా ఉందన్నారు. రాజధాని విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరేంటో స్పష్టంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరో లాంగ్ మార్చ్?
ప్రజా సమస్యలపై గతంలో విశాఖపట్నంలో చేపట్టిన మాదిరిగానే అమరావతి రైతులకు మద్దతుగా విజయవాడలోనూ లాంగ్ మార్చ్ చేపట్టాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నట్లు జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో ఆలోచించిన తర్వాతే, పవన్ ఓ నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాతగానీ అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications