పవన్ కొందరి వాడేనా .. కాపు అజెండాపై యూటర్న్ ? బీజేపీ ఒత్తిడే కారణం
నిన్న మొన్నటి దాకా అందరివాడిని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొందరి వాడిగానే మారాడా ? గతంలో తాను కాపు సామాజిక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించనని, అన్ని సామాజిక వర్గాలకు , పేద బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపు అజెండాపై యూటర్న్ తీసుకున్నారా ? బి.జె.పి.తో జత కట్టి ఏపీ రాజకీయాల్లో ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ పై బిజెపి ఒత్తిడే అందుకు కారణమా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

కాపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ .. రాజకీయ వర్గాల్లో చర్చ
ఒకపక్క తిరుపతి ఉప ఎన్నికలు, మరోపక్క ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఈ హడావిడిలో తలమునకలైన ప్రజలు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో షాక్ అయ్యారు. కాపులు శాసించే స్థాయికి ఎదగాలని, యాచించే స్థాయి నుంచి బయటకు రావాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. గతంలో తనకు కులం ముద్ర పడకుండా అనేకసార్లు ప్రకటనలు చేసిన పవన్ ఇప్పుడు ఏకంగా కాపులపై సంచలన వ్యాఖ్యలు చెయ్యటం ఆసక్తికరంగా మారింది.

నిన్నటిదాకా కులం ముద్ర పడకుండా అందరి వాడినని చెప్పుకున్న పవన్
రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ ద్వారా అందరివాడిగా తనను తాను పరిచయం చేసుకున్న పవన్ కళ్యాణ్, మొదట్లో తాను కాపు అజెండాకు దూరం అని చెప్పారు. అన్ని సామాజిక వర్గాల కోసం రాజకీయం చేస్తానని ప్రకటించారు. ప్రత్యర్థి పార్టీలు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా, ఒక వర్గానికి పరిమితం చేయాలని ప్రయత్నం చేసిన సమయంలో కూడా దీటుగా ఎదుర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలు తనవేనంటూ, పేద బడుగు బలహీన వర్గాల గొంతుకగా ప్రశ్నిస్తాను అంటూ ప్రకటన చేసుకున్నారు .

కాపు అజెండా పై పవన్ యూటర్న్ .. బీజేపీ ఒత్తిడి వల్లే
గత ఎన్నికల సమయంలో కూడా కాపు అజెండాతో ప్రజల్లోకి వెళ్ళదు పవన్ కళ్యాణ్ .అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. కులం అంటగడతారు అనే భయం లేదు అని చెబుతూనే పవన్ కళ్యాణ్ తన కాపు అజెండాను ప్రకటించేశారు. అయితే ఇదంతా బీజేపీ ఒత్తిడి వల్లే అని రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం అజెండాతో టిడిపి, రెడ్డి సామాజిక వర్గ అజెండాతో వైసిపి ఉన్న సమయంలో బిజెపి కాపు సామాజిక వర్గ అజెండా ఎత్తుకున్న విషయం తెలిసిందే.

కాపుల ఓటు బ్యాంకు కోసం పవన్ కొందరివాడిగా మారారా ?
ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గ అజెండాతోనే ముందుకు వెళితే కాపుల ఓటు బ్యాంక్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి వెసులుబాటు దొరుకుతుందనేది బీజేపీ ఎత్తుగడ .అందుకే నిన్నమొన్నటిదాకా అందరివాడిని అన్న చెప్పుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు బిజెపి ఒత్తిడితో కొందరి వాడిగా మారక తప్పలేదు అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. రాష్ట్రంలో కాపులను, కాపు నాయకుడుగా తమ వైపుకు పవన్ కళ్యాణ్ తిప్పగలిగితే వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేన కూటమికి లబ్ధి చేకూరుతుందనే భావన పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలకు కారణమని తెలుస్తోంది.

పవన్ రూటు మార్చటం వెనుక బీజేపీ .. లబ్ది జరుగుతుందా ?
ఏది ఏమైనప్పటికీ తాను అన్ని కులాలు అన్ని మతాలూ అన్ని ప్రాంతాలకు చెందిన వాడినని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రూటు మార్చి కాపు అజెండా అందుకోవడం వెనక బిజెపి ఉందన్నదే ప్రధాన చర్చ. మరి పవన్ కాపు అజెండా బిజెపి, జనసేనకు ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications