నిద్రపోతున్నారా?: హత్తిబెలగళ్ పేలుడు ప్రాంతాన్ని సందర్శించిన పవన్, అభిమానుల తోపులాట
కర్నూలు: జిల్లాలోని ఆలూరు మండలం హత్తిబెలగళ్ పేలుడు ప్రాంతాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం సందర్శించారు. గత శుక్రవారం రాత్రి హత్తిబెలగళ్ క్వారీ ప్రాంతంలో సిలిండర్, జిలిటిన్స్టిక్స్ పేలడంతో 12మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
క్వారీ ప్రాంతంలో..
హత్తిబెలగళ్ ప్రాంతానికి పవన్ వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అక్కడకు చేరుకున్నారు. దీంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు తలకుమించిన భారమైంది.
Recommended Video
కార్యకర్తల తోపులాటతో..
కాసేపు క్వారీ వద్ద పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్.. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అభిమానులు, కార్యకర్తల తోపులాట ఎక్కువ కావడంతో పవన్ అక్కడ్నుంచి బయల్దేరి వెళ్లిపోయారు.
బాధితులకు పరామర్శ
ఆ తర్వాత పేలుడు కారణంగా పగుళ్లు తేలిన ఇళ్లను పరిశీలించారు. పేలుడు బాధితులను, బాధిత కుటుంబాలను పవన్ పరామర్శించారు. స్థానికులను కూడా పవన్ పేలుళ్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నిద్రపోతున్నారా?
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..హత్తిబెళగల్ క్వారీ పేలుడు ఘటన దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇలాంటి క్వారీలను మూసేయకుంటే జనసేన కార్యకర్తలే ఆ పని చేస్తారని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఇంతటి ప్రమాదాలు జరుగుతుంటే గనులశాఖ మంత్రి, అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు.