పవన్ శపథం, చిరు సిద్ధం: జగన్పై 'పవర్' ప్రభావమెంత?
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు పొత్తులు, మరోవైపు ప్రచారాలతో నేతలు బిజీగా ఉంటున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆధ్వర్యంలో రేపటి నుండి కాంగ్రెసు పార్టీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమవుతుంది.
కాంగ్రెసు పార్టీనీ ఒక్క సీటు కూడా గెలవకుండా చూస్తానని ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శపథం చేయగా.. చిరంజీవి కాంగ్రెసు పార్టీ బలోపేతం కోసం నడుం కట్టారు. పవన్ జనసేన పార్టీ ప్రకటన సమయంలో కాంగ్రెసు హఠావో దేశ్ బచావో అని నినదించారు. ఈ నినాదం ఇటు టిడిపి, అటు బిజెపిలకు ఆయనను దగ్గర చేసింది. పవన్ కూడా టిడిపి, బిజెపిలతో వెళ్లేందుకే సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రసంగం ద్వారా అర్థమయింది.

ఇందులో భాగంగా పవన్ ఐదో రోజుల క్రితమే టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్లుగా వార్తలు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో అహ్మదాబాదులో భేటీ కానున్నారు. మోడీతో భేటీలోనే పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇక, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియాల్సి ఉంది.
పవన్కు ఇప్పుడే ఎన్నికల బరిలో దిగడం ఆసక్తి లేదంటున్నారు. ఆయన టార్గెట్ 2019 అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సెలెక్టివ్ నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను దించి, ఆ పై వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతారంటున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు జరిపి, రేపు మోడీతో చర్చలు జరపబోతున్న పవన్... ఆ తర్వాత కాంగ్రెసు టార్గెట్గా ప్రచార బరిలో దిగే అవకాశాలున్నాయి.
పొత్తు విషయమై స్పష్టత రాగానే ఆయన తెలంగాణ, సీమాంధ్రల్లో కాంగ్రెసుకు వ్యతిరేకంగా రంగలోకి దిగనున్నారు. ఆయన సోదరుడు చిరంజీవి మాత్రం సీమాంధ్రకే పరిమితం! కాంగ్రెసు పార్టీని గెలవకుండా చేస్తానని పవన్ ప్రతిజ్ఞ చేయగా, దానిని చిరంజీవి స్వీకరించారనే చెప్పవచ్చు. సోదరుడిగా పవన్కు తన ఆశీస్సులు ఉంటాయని, రాజకీయ నాయకుడిగా మాత్రం తన ప్రత్యర్థేనని చెప్పి ఎదుర్కొనేందుకు సిద్ధమని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, పవన్ పార్టీ ఆరంగేట్రంతో సీమాంధ్రలో ఈక్వేషన్స్ మారుతున్నాయి. పవన్ పార్టీకి ముందు సీమాంధ్రలో జగన్ పార్టీ మొదటి స్థానంలో ఆ తర్వాతి స్థానంలో టిడిపి ఉందని సర్వేలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా టిడిపి పుంజుకుందని సర్వేల ద్వారా తెలిసింది.
వారం రోజుల క్రితం అంటే పవన్ పార్టీ ప్రకటన సమయంలో.. ఓ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన సర్వేలో జగన్ పార్టీకి 15, టిడిపి, బిజెపిల కూటమికి 9 స్థానాలు వస్తాయని తేలింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీతో ఆ సర్వేలు తారుమారు కాక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రభావం ఉంటుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications