లడ్డూ వివాదం, శ్రీవారి ఆస్తులు టచ్ చేస్తే?, పవన్ కల్యాణ్ వార్నింగ్
గతంలో టీటీడీ పాలక మండళ్లకు నేతృత్వం వహించిన వాళ్ళు టీటీడీ ఆస్తులు కాపాడడానికి ప్రయత్నించారా ?, ఆ ఆస్తులు విక్రయించడానికి ప్రయత్నించారా?, శ్రీవారి ఆస్తులను విక్రయించేలా టీటీడీ పాలకమండళ్లను నడిపింది ఎవరు ? అనే పూర్తి వివరాలు బయటకు లాగుతామని, వాళ్ల పేర్లు కూడా ప్రజల ముందు పెడతామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీ వెంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన శ్రీవారి ఆస్తులతో చెలగాటం ఆడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. టీటీడీ ఆస్తుల విషయంలో గత పాలకమండళ్లు తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాల భూములుపై సమీక్ష నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడుకు తాను ఇప్పటికే సూచించానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీవారి భక్తులకి, ప్రజలకి హామీ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సిగ్గుచేటు అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. శ్రీవారి పై భక్తితో భక్తులు కానుకలు సమర్పిస్తారని, హుండీలో దస్తావేదులు కూడా వేస్తారని, నగదుతో పాటు బంగారు ఆభరణాలు కూడా హుండీలో సమర్పిస్తారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

గతంలో తమిళనాడులోని 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని గత పాలకమండలి నిర్ణయించిందని, వాటి విలువ రూ 23 కోట్లకు పైగా ఉంటుందని, నిరర్థక ఆస్తుల ద్వారా రూ. 100 కోట్ల సమకూర్చుకోవాలని ప్రయత్నాలు జరిగాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. మల్కాజ్గిగిరి, హిమాయత్ నగర్, రంగారెడ్డి జిల్లా, నాందేడ్, గుంటూరు, బెంగళూరులోని కొన్ని ఆస్తులను గత పాలకమండలి అమ్మకానికి సిద్ధం చేసిందని, నాడు ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు, పలు హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించడంతో గత టీటీడీ పాలకమండలి శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

శ్రీవారి స్థిరాస్తులు అమ్మకానికి చూసినవారిని, శ్రీవారి ఆస్తులు, శ్రీవారి ఆభరణాల విషయంలో కూడా ఏమైనా అవాంచనీయ నిర్ణయాలు తీసుకున్నారా అన్నదానిపై విచారణ జరిపిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. టీటీడీతో పాటు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు సత్రాలు, ఆస్తుల విషయంలో సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను సూచించానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
టీటీడీతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఆలయాల ఆస్తులు, వాటి ఆదాయం లెక్కలు పరిశీలిస్తామని, దేవుడి ఆస్తులు ఇతర పాలుకాకుండా కాపాడటానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇప్పటి వరకు ఎంత నిధులు వచ్చాయి, ఆ నిధుల్లో దేనికి ఎంత ఖర్చు చేశారు, శ్రీవారి ట్రస్ట్ ఆదాయాన్ని దారి మళ్లించారా అనే విషయంపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు నాయుడుకు తాను మనవి చేశానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.

మొత్తం మీద టీటీడీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, హిందువుల మనోభావాల దెబ్బ తీసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications