అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలనుకుంటే, ప్రభుత్వం వత్తాసు: పవన్ వార్నింగ్
అగ్రిగోల్డ్ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తీవ్రంగా స్పందించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలనుకుంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు.
అమరావతి: అగ్రిగోల్డ్ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తీవ్రంగా స్పందించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలనుకుంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. ఈ అంశంపై ఓ టాస్క్ ఫోర్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు.
భవిష్యత్తు మీద ఆశతో పేదలు అగ్రిగోల్డులో పెట్టుబడులు పెట్టారన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏజెంట్ల తప్పు లేదన్నారు. ఏజెంట్ల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల చావులు ఆగిపోవాలన్నారు.
హాయ్ ల్యాండ్ అమ్మినా వందల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలనుకుంటే ప్రజాగ్రహం తప్పదన్నారు. ప్రజా సమస్యలపై పార్టీలకు అతీతంగా పని చేయాలన్నారు.

గోటితే పోయేదానికి..
బాధితులకు న్యాయం చేసేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో మొదట్లోనే చెక్కులు బౌన్స్ అయినప్పుడు చర్యలు తీసుకుంటే బాగుండునని చెప్పారు. గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తీసుకు వెళ్లవద్దన్నారు.
తమ తప్పు లేకుండానే తీవ్ర ఇబ్బందులు పడుతున్న అగ్రీగోల్డ్ ఏజంట్లను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం దిగిరావాలన్నారు. సర్వస్వం అమ్మేసి ఇప్పటికే ఎంతో మంది డబ్బులను వెనక్కు చెల్లించిన ఏజంట్లు రోడ్డున పడ్డారని, వారిని మరింతగా ఇబ్బందులు పెట్టవద్దని డిపాజిట్దారులను కోరారు.

టాస్క్ఫోర్స్ ఎందుకు వేయలేదు
వారిని ఆదుకుని తీరాల్సిందేనన్నారు. ఏజంట్లను శవాలపై చిల్లర ఏరుకునే పరిస్థితికి తీసుకురావద్దని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వమే కల్పించుకోవాలన్నారు. దక్షిణ భారతావనితో పాటు తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించిన అగ్రిగోల్డ్ ఆస్తులపై ప్రభుత్వాలు ఇంతవరకూ టాస్క్ ఫోర్స్ను ఎందుకు పెట్టలేదన్నారు.
ఎక్కడ ఏ ఆస్తులున్నాయో లెక్కించకపోవడాన్ని చూస్తుంటే, కొందరు ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. ఇంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఏజంట్లపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించారు.

ఏజెంట్లపై దాడులు జరగకుండా..
ఏజంట్లపై దాడులు జరుగకుండా స్థానిక పోలీసు స్టేషన్లకు, జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఎందుకు జారీ చేయలేదని ప్రభుత్వాన్ని అడిగారు. ఇకపై ఒక్క చావు కూడా లేకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాలని, ఎంతో కొంత ఫండ్ రిలీజ్ చేసి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టిన వారికి వెనక్కు ఇవ్వాలన్నారు.
రూ. 20 వేల వరకూ పెట్టిన వారు 13 లక్షల మంది ఉన్నారని, వారి డబ్బు వెనక్కు ఇస్తే, ఆత్మహత్యలు ఆగుతాయన్నారు. పేదల నుంచి పెట్టుబడులు స్వీకరిస్తున్న అగ్రిగోల్డ్ పెద్దలకు ప్రభుత్వం వత్తాసు పలికినట్టు తనకు స్పష్టంగా అర్థమైందన్నారు.

పెద్దలు నాడు మద్దతిచ్చారు
ఇటువంటి సంస్థలు బాగా పని చేస్తున్నాయని ప్రభుత్వ పెద్దలు చెప్పడం, వారికి పిలిచి అవార్డులు ఇవ్వడం తదితరాల కారణంగా, ఏజంట్లు సైతం ఇవి మంచి కంపెనీలని నమ్మి ప్రజల్లోకి వెళ్లి పెట్టుబడులు సేకరించారని చెప్పారు.
ఒక్క రోజులో ఈ తరహా సూట్ కేస్ కంపెనీలను ఎత్తేస్తే, గ్రామాల్లోని ఏజంట్లు, తమకేమీ సంబంధం లేదని చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని, అదే అగ్రిగోల్డ్ బాధితుల వ్యధని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావు
గతంలో అగ్రిగోల్డ్ ఫంక్షన్స్కు వెళ్లి, వాళ్ల భుజం తట్టిన పెద్దలు, ఇప్పుడు తమకేమీ సంబంధం లేదన్నట్టు వెనక్కు తిరిగి వెళ్లిపోయారన్నారు. సహారా కేసులో సుప్రీం కల్పించుకున్నట్టుగానే ఈ కేసులో చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
గోటితో పోయే అగ్రిగోల్డ్ సమస్యను ప్రభుత్వ పెద్దలు గొడ్డలి దాకా తీసుకు వచ్చారని పవన్ కళ్యాణ్ ఆగ్రహించారు. తొలి రోజున అగ్రీగోల్డ్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన సమయంలోనే ప్రభుత్వం స్పందించివుంటే ఇన్ని ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదన్నారు.

అప్పులు, వడ్డీల బాధలు నాకు తెలుసు..
ఈ ఉదంతం వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. తాను రెండేళ్ల నుంచి ఈ సమస్య గురించి ఆలోచిస్తూనే ఉన్నానని, అప్పులు, వడ్డీల బాధలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని అన్నారు.
రాజకీయ నాయకులు బాధితులపై ఆధిపత్యం చూపడం, వారి ఆందోళనపై పోలీసులను ప్రయోగించడం తనను కలచి వేసిందన్నారు. ముందుగానే నివారించగలిగే సమస్యను జఠిలం చేశారని ఆరోపించిన ఆయన, ఈ పరిస్థితికి అన్ని ప్రభుత్వాలూ కారణమేనని అన్నారు.

ప్రశ్నించే దమ్ము ఉండాలి
1995లో ప్రారంభించిన కంపెనీ ఇదని, వీళ్ల పెట్టుబడులన్నీ పేదల నుంచి పెట్టుబడులు స్వీకరించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. పేదలు కాబట్టే ఈ కేసులో ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయన్నారు.
చట్టం బలహీనులపై బలంగా, బలవంతులపై బలహీనంగా పని చేస్తోందని, తప్పు చేస్తే ప్రశ్నించే దమ్ము, ధైర్యం సమాజానికి ఉండాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. న్యాయం జరగకుంటే వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తానని చెప్పారు. సహారా, సత్యం, శారదా కుంభకోణాల్లో బాధితులకు ప్రభుత్వాలు కొంత సాయం చేశాయన్నారు.












Click it and Unblock the Notifications