హద్దు దాటొద్దు: జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్
తమ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభివృద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్థమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలన్నారు. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్న తరుణంలో పార్టీలోని ఎవరు మాట్లాడినా, అధికారుల పనితీరును బలహీనపరిచే విధంగా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాలలో పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. అటువంటివారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. తొలుత షోకాజ్ నోటీసు జారీ అవుతుందన్నారు. నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం రాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అందుకే పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్ఠను ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరారు.
పవన్తో ఏపీ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు భేటీ
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. పవన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి శ్రీనివాసరావు వచ్చారు. గంటన్నరపాటు వీరి సమావేశం సాగింది. రాష్ట్రంలో జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు.
రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడ పొరపొచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలని కూటమి ఇచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకుని నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.












Click it and Unblock the Notifications