చిరంజీవి తుపాకీ అందుకే ఇచ్చారు, పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించా: టీడీపీకి పవన్ వార్నింగ్
Recommended Video
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలంటే ఏమైనా పైనుంచి దిగివచ్చారా? వాళ్లకు మేమేమైనా బానిసలమా? అని నిలదీశారు.
విశాఖపట్నంలోని కళా వాహిని పోర్టు స్టేడియంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజాసేవ కోసం వచ్చిన వారందరూ రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలన్నారు.
పిచ్చి వేషాలొద్దంటూ హెచ్చరిక
ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అల్లుడు ఎవరైనా సరే రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు దోపిడీ చేస్తామంటే.. చేతులు కట్టుకుని కూర్చోబోమని, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.
అన్ని వదిలేసి వచ్చా..
అన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, పోతే ప్రాణాలే పోతాయని ధైర్యంగా అడుగువేశానని పవన్ అన్నారు. రాజకీయ నాయకులు తలచుకుంటే ఒక్క సంతకంతో తలరాతలు మార్చేయవచ్చని తెలిపారు. టీడీపీ నేతల అన్యాయాలను, అక్రమాలను ఇలాగే మౌనంగా చూస్తూ కూర్చుంటే విశాఖలోని డాల్ఫిన్ కొండలను కూడా టీడీపీ నేతలు ఆక్రమించుకుంటారని అన్నారు. తప్పు చేస్తున్నవారిని తానెందుకు ప్రశ్నించకూడదని పవన్ అన్నారు.
చిరంజీవి తుపాకీ అందుకే ఇచ్చారు..
సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తనకున్న ఆవేశానికి ఎక్కడ తీవ్రవాద ఉద్యమాల్లోకి పోతాడోనని తన సోదరుడు చిరంజీవి ఆందోళన చెందేవారని తెలిపారు. తనకు ఓ తుపాకీ కొనిస్తే.. ఇంట్లోనే ఉంటాడని భావించి.. ఆనాడు తన అన్నయ్య చిరంజీవి తనకు ఓ తుపాకీ కొనిచ్చారని పవన్ చెప్పారు. తన ఆవేదన, ఆవేశం అన్యాయం మీదనే తప్ప, తుపాకీ కోసం కాదని ఆనాడు తన అన్నకు వివరించలేకపోయానని పవన్ చెప్పారు. తుపాకీ తీసుకున్న వేళ దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలియదని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తుంటే ప్రశ్నించకుండా ఎలా ఉంటామని అన్నారు.
రాజకీయాలపై చిరంజీవిని సూటిగా ప్రశ్నించా
రాజకీయాల్లోకి నువ్వెళ్తావా? నన్ను వెళ్లమంటావా? అని తాను చిరంజీవిని సూటిగా ప్రశ్నించానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ తర్వాతే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే సంతోషం వస్తుందా? శాంతం ఉంటుందా? అని పవన్ ప్రశ్నించారు.
కులం అంటగడితే కాళ్లు విరగ్గొడతా..
టీడీపీ వాళ్లకు మాత్రమే కులం ఉండదు.. ఎవరు ఏ పార్టీ పెట్టినా వారికి కులం అంటగడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు కులం అంటగడితే కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించారు. తన వద్ద డబ్బులు, మీడియా ఛానళ్లు లేవని..నిర్భయంగా పోరాడే సత్తా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాగా, పవన్ కళ్యాణ్ విశాఖలోని ఉత్తర భారతదేశానికి చెందిన పలువురితో గురువారం భేటీ అయ్యారు.
నార్త్ ఇండియన్స్కు అండగా ఉంటాం: పవన్
ఏపీలోని ఉత్తర భారతీయులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రాంతాలు, జాతులు, మతాలు, కులాల కలయికే భారతదేశమని పనవ్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నంలోని పాండురంగపురం వైట్హౌస్లో విశాఖలో స్థిరపడ్డ, నివసిస్తున్న ఉత్తర భారతీయుల సమావేశంలో పవన్ మాట్లాడారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య తగాదాలు, జాతుల మధ్య వైరాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. భారతీయతను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ జనసేన అని తెలిపారు.
చిరంజీవి మాటలు గుర్తొచ్చి...
తాను 10వ తరగతిలో ఉన్నప్పుడు ఒక యోగి ఆత్మకథ పుస్తకం చాలా ప్రభావం చూపిందని, అన్నీ వదులుకుని శాంతి మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నానని పవన్ చెప్పారు. అయితే, అదే సమయంలో చిరంజీవి చెప్పిన మాటలు మళ్లీ నాలో ఆలోచనలు రేకెత్తించాయని అన్నారు. ఏదైనా సాధించి, సంపాదించాక దానిని వదులుకోవడానికి సిద్ధమైనప్పుడు.. ఆ మాట చెప్పు అని చిరంజీవి అన్నారని.. అందుకే సినిమాల్లో సంపాదించి, రాజకీయ పార్టీ పెట్టి మళ్లీ ప్రజలకే ఖర్చు చేస్తున్నానని పవన్ తెలిపారు. తనకు డబ్బు అవసరం లేదని, సమతుల్యత శాంతి కావాలని పవన్ పిలుపునిచ్చారు.