Pawan Kalyan:వారాహి తాళాలు ఎవరి దగ్గర - ఏం జరుగుతోంది..!?
వారాహి. పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దం చేసుకున్న ప్రచార రధం. వారాహి పరిచయం సమయం నుంచి వైసీపీ నేతల నుంచి విమర్శలు మొదలయ్యాయి. తాను వారాహి తోనే ప్రజల మధ్యకు వస్తానని పవన్ ప్రకటించారు. ఎవరైనా అడ్డుకొని చూడండి..అప్పుడు చూస్తారంటూ హెచ్చరించారు. గత ఏడాది దసరా నుంచి వారాహితో తిరుపతి నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని కొందరు జనసేన నేతలు చెప్పారు. కానీ, ఇప్పటికీ వారాహి యాత్ర ఎప్పుడనేది స్పష్టత రావటం లేదు. అటు వైసీపీ..టీడీపీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..జనసేనలో మాత్రం ఆ సందడి కనిపించటం లేదు.
వారాహి యాత్ర ఎప్పుడు: పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేయించారు. ఆ తరువాత విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయంలోనూ పూజలు చేసారు. మరో పది నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో పవన్ ఇక వారాహి యాత్ర ప్రారంభిస్తారని పార్టీ నేతలు భావించారు. పార్టీ ఆవిర్భావ సభ నుంచి ఇక పూర్తిగా పార్టీ పైనే ఫోకస్ చేస్తారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు.

పవన్ సైతం తాను విజయవాడ పశ్చిమం నుంచి నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభించి.. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతం దిశగా నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ, పార్టీ ఆవిర్బావ సభ జరిగి నెల పూర్తయింది. ఆ సభ తరువాత ఇప్పటి వరకు పార్టీ పరంగా ఒక్క కార్యక్రమం నిర్వహించ లేదు.
ఎన్నికల సంసిద్దత ఎక్కడ: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా, రాష్ట్ర ఇంఛార్జ్ మురళీ థరన్ తో సమావేశమయ్యారు. ఆ చర్చల్లో కీలక అంశాలు ప్రస్తావన కు వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే, బీజేపీ - జనసేన తో టీడీపీని కూడా కలుపుకుని 2014 పొత్తులను రిపీట్ చేయాలని పవన్ కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు సైతం ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇటు రాష్ట్రంలో వైసీపీ - టీడీపీ ఎన్నికల దిశగా కార్యాచరణ వేగవంతం చేసాయి. పార్టీ అభ్యర్దులను సైతం ఖరారు చేస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల గడప గడపకు వెళ్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా యాత్రలు.. లోకేష్ పాద యాత్రలు కొనసాగిస్తున్నారు. కానీ, జనసే నుంచి మాత్రం ఎటువంటి కార్యాచరణ లేదు. ఎన్నికల దిశగా ఎటువంటి కసరత్తు ప్రారంభమైనట్లు కనిపించటం లేదు

పవన్ తేల్చేదెన్నడు: పవన్ వారాహి యాత్ర పైన పార్టీ నేతల్లోనూ స్పష్టత లేదు. లోకేష్ పాద యాత్ర రాయలసీమలో పూర్తయ్యే వరకూ పవన్ యాత్ర ప్రారంభం కాదనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పవన్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నా..రాజకీయంగానూ పార్టీకి సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటు బీజేపీ..అటు టీడీపీతో పొత్తు పైన జనసేన అధికారికంగా తేల్చటం లేదు.
ఈ పొత్తులపైన క్లారిటీ వచ్చిన తరువాతనే పవన్ వారాహి యాత్ర ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఈ సారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాదలుచుకోలేదంటూ చెప్పిన పవన్.. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్నా..ఇంకా తాత్సారం చేస్తున్నారు. టీడీపీతో చర్చలు వార్తలు వస్తున్న పార్టీ నేతలు ఖండిస్తున్నారు. దీంతో, పార్టీలోనూ పవన్ స్పష్టమైన నిర్ణయం కోసం నిరీక్షణ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications