పవన్ కళ్యాణ్కు చంద్రబాబు చేయి: కేశినేనికే టికెట్
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సిఫార్సును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్కు పవన్ కళ్యాణ్ సూచన మేరకు విజయవాడ లోకసభ టికెట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రాబబు నాయుడు ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పొట్లూరి వరప్రసాద్కు విజయవాడ టికెట్ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ బిజెపి నేతలపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
అయితే, పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఫలించినట్లు లేదు. తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ లోకసభ నానీని బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నానీని మార్చడం సరికాదంటూ చంద్రబాబుపై నేతల నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో నాని వైపే బాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కేశినేని నానిని చర్చల కోసం చంద్రబాబు హైదరాబాద్ పిలిపించారు. ఆయనతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ సూచనను పట్టించుకోలేదని తెలుస్తోంది.
విజయవాడకు టిడిపి ఇంఛార్జిగా చాలా రోజుల నుండి కేశినేని నాని ఉన్నారు. ఆయనకు లోకసభ టిక్కెట్ ఇస్తారని తొలి నుండి అందరూ భావించారు. ఆయన కూడా అదే ఆశతో ఉన్నారు. విజయవాడ లోకసభ పైన ఆశలు పెట్టుకున్న వల్లభనేని వంశీకి గన్నవరం శాసనసభా స్థానం కేటాయించి చంద్రబాబు నాయుడు నానికి పోరు లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని లోకసభకు టిడిపి - బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తారని గట్టిగా నమ్మారు.
విజయవాడ లోకసభకు బదులు పెనమలూరు లేదా విజయవాడ తూర్పును తీసుకోవాలని అధినేత సూచించారు. అయితే, కేశినేని మాత్రం ససేమీరా అంటున్నారట. పవన్ అడిగిన ఒక్క సీటు ఇవ్వకుంటే అసలుకే మోసం వస్తుందనే ఆందోళన కూడా లేకపోలేదు.