Tdp and Janasena: తెలుగుదేశం పార్టీ కోసం ఢిల్లీకి పవన్ కల్యాణ్?
తెలుగుదేశం పార్టీ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పయనమవబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తేదీ ఖారారవగానే ఆయన నాదెండ్ల మనోహర్తో కలిసి హస్తినాపురం వెళ్లనున్నారు. రాష్ట్రంలో అధ్వాన్న పరిపాలన, అభివృద్ధి లేకపోవడం, శాంతి భద్రతలు దిగజారిపోవడం, విలువల్లేని రాజకీయ పరిస్థితులు, కులాల మధ్య పోరు పెడుతున్న అధికార పార్టీ.. తదితర విషయాలను ఆయన వారితో చర్చించబోతున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి.

నడ్డాతో నేరుగా చర్చించడానికి ఇష్టపడిన జనసేనాని
ఈనెల ఆరోతేదీ నుంచి రెండురోజుల పాటు భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించబోతున్నారు. అయితే ఆయనతో ఈ విషయాలు చర్చించడానికి, ఆయన్ను కలవడానికి పవన్ ఇష్టపడంలేదని సమాచారం. అయితే గతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సదర్భంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, పొత్తులుంటాయని, బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

బీజేపీ నేతలను ఒప్పించాలనే పట్టుదలతో పవన్
తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని పవన్కల్యాణ్ బీజేపీ నేతలను ఒప్పించే అవకాశం కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా బీజేపీతో తెలుగుదేశం పార్టీ వైరం పెట్టుకొని ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బీజేపీకి రాష్ట్రంలో సంస్థాగతంగా బలం లేకపోయినప్పటికీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబునాయుడు ఆసక్తి చూపిస్తున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీచేయడంవల్ల రాష్ట్రంలో అధికారాన్ని సులువుగా కైవసం చేసుకోవచ్చని, ఎంపీ సీట్లు కూడా అత్యధిక సంఖ్యలో వస్తాయంటూ కొన్ని సర్వేల వివరాలను మోడీ, అమిత్ షా ముందు పవన్ ఉంచబోతున్నారు.

ఎలాగైనా వైసీపీని ఓడించాలనే పట్టుదల!
జనసేన అధినేత ఎప్పటినుంచో రాష్ట్రంలో వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి ఆయన మానసికంగా సంసిద్ధులవడమేకాకుండా పార్టీ శ్రేణులను కూడా సిద్ధం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తామిద్దరికి జతకూడితే మరింత బలం చేకూరుతుందని, అందుకు మోడీని, అమిత్ షాను ఒప్పించగలనన్న ధీమాలో పవన్కల్యాణ్ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసివెళ్లడం ఖాయమని నిర్థారించుకున్న అధికార పార్టీ పవన్ను లక్ష్యంగా ఎంచుకుందని జనసేన సైనికులు అంటున్నారు.
అంతేకాకుండా పార్టీ శ్రేణులను భయపెట్టే విధంగా రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేస్తున్నారని, త్వరలోనే జనసేన తరఫున ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసి ఈ కేసులపై కోర్టులో సవాల్ చేయబోతున్నట్లు జనసేన పార్టీ కార్యాలయవర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications