బీజేపీ ట్రాప్ లో పవన్, గేమ్ షురూ - ఆపరేషన్ 2024..!!
తెలంగాణలో ఎన్నికల రాజకీయం ఏపీలో ప్రభావం చూపిస్తోంది. ఏపీలో ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. జనసేన మాత్రం ఎన్డీఏ భాగస్వామిగా ఉంటూ తెలంగాణలో బీజేపీ తో కలిసి పోటీ చేస్తోంది. అదే సమయంలో ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించింది. ఏపీలో అంతిమ లక్ష్యం కోసమే పవన్ ఈ వ్యూహం అమలు చేస్తున్నారనేది జనసేన నేతల వాదన. కానీ, బీజేపీ ఇంతకు మించిన ఆట మొదలు పెట్టింది. ఏం జరుగుతోంది.
మారుతున్న లెక్కలు: 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఏపీలో పని చేసాయి. టీడీపీ - బీజేపీ అధికారంలో భాగస్వాములయ్యారు. ఆ తరువాత మూడు పార్టీలు విడిపోయాయి. 2019 ఎన్నికల తరువాత బీజేపీ - జనసేన కలిసాయి. కొద్ది నెలల క్రితం ఎన్డీఏలోకి పవన్ ను ఆహ్వానించారు. ఏపీలో పవన్ తిరిగి 2014 తరహా పొత్తులు అవసరమని చెబుతూ వచ్చారు.

బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్..ఆ పార్టీతో అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఏదో ఒక రోజు టీడీపీ - బీజేపీ కలిస్తే..తమ మూడు పార్టీలు కలిసి జగన్ ను ఓడించాలనేది పవన్ లక్ష్యం. కానీ, ఇప్పటికీ ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ భర్తీ కాలేదు. చంద్రబాబు అరెస్ట్ తరువాత బీజేపీతో చర్చింకుండానే పవన్ ఏకపక్షంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు. దీనికి గల కారణాలను తాను బీజేపీ ముఖ్య నేతలకు వివరిస్తానని చెప్పుకొచ్చారు.
ఇటు బీజేపీ..అటు టీడీపీ: కానీ, ఈ విషయం పైన బీజేపీ అడగలేదు...పవన్ చర్చించలేదు. తెలంగాణ ఎన్నికల్లోనే ఈ పొత్తు బీజేపీకి అవసరమవుతుందని అందరూ అంచనా వేసారు. కానీ, బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీని వద్దని జనసేనతో కలిసి సీట్లు పంచుకోవాలని నిర్ణయించింది. దీని ద్వారా పవన్ తో మాత్రమే తమకు పొత్తు ఉంటుందని స్పష్టం చేసింది. చంద్రబాబుతో కలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కు టార్గెట్ అవుతామని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు.

కానీ, వైఎస్సార్టీపీ ఇప్పటికే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోంది. ఇటు పవన్ సైతం టీడీపీ కంటే తెలంగాణలో ప్రభావం చూపించే స్థాయిలో లేరనేది వాస్తవం. అక్కడ కూడా పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓట్లుగా మారే అవకాశం ఉంది. ఇవన్నీ తెలిసినా..బీజేపీ తమతో పవన్ కొనసాగటం..మరో పార్టీకి దగ్గర కాకుండా డిసైడ్ చేసిన వ్యూహంలో భాగమనేనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఫలితాలతో గేమ్ ఛేంజ్: ఇక, పవన్ ఇటు తెలంగాణలో బీజేపీతో..ఏపీలో టీడీపీతో కలవటం ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తే సరే. కానీ, అందుకు బీజేపీ సిద్దంగా లేదని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తరువాత బీజేపీతో కలిసేందుకు టీడీపీ ముఖ్యులు అంత సుముఖంగా లేరనే అభిప్రాయం ఉంది.

అయితే, జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ మద్దతు అవసరమనేది మరో వాదన. కానీ, తమతో ఉంటూనే టీడీపీతో కలిసిన పవన్ ను అదే తరహాలో కూల్ గా ఫిక్స్ చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కానీ, పవన్ మద్దతు దారులు మాత్రం ఏపీలో లక్ష్యం చేరుకోవటం కోసమే పవన్ కు ఈ పొలిటికల్ గేమ్ తప్పటం లేదంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన - బీజేపీకి గౌరవప్రదమైన సీట్లు - ఓట్లు రాకుంటే పవన్ గేమ్ బూమ్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది.
ఏపీ పైనా ప్రభావం: ఒక విధంగా ఈ గేమ్ లో టీడీపీ సేఫ్ పొజీషనల్ లో ఉంది. అటు బీజేపీ - ఇటు టీడీపీ మధ్య పవన్ పొలిటికల్ రిస్క్ తీసుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. బీజేపీ కంటే టీడీపీతో పొత్తు, ఏపీలో జగన్ ను ఓడించటమే పవన్ అసలు లక్ష్యమని జనసేన నేతలు చెబుతున్నారు. మరి..టీడీపీనే పవన్ కు ప్రయార్టీ అయితే బీజేపీ ఏం చేస్తుంది..తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీ రాజకీయంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications