ఆత్మగౌరవాన్ని అమ్ముకోవద్దు- పవన్ కు సవాల్ విసిరిన ప్రకాష్ రాజ్
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఏపీ మినహా ఇతర దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా ప్రతిఘటించిన ఈ డిలిమిటేషన్ బిల్లుపై సభలో అధికార పక్షానికి చుక్కెదురైంది. బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో ఇది వీగిపోయింది. దీంతో విపక్షాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జోష్ కనిపిస్తోంది.
బిల్లు వీగిపోవడం పట్ల ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడానికి లభించిన చారిత్రక అవకాశాన్ని ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, మహిళా సాధికారతను పెంపొందించే సంస్కరణలను చేపట్టడం వారికి నచ్చట్లేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు నిరాకరించడం ద్వారా ప్రతిపక్షాలు జాతీయ ప్రగతి కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చాయని మండిపడ్డారు.

బిల్లు వీగిపోవడం.. సంస్కరణలతో కూడిన సమగ్ర పాలన, లింగ సమానత్వం దిశగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సామాజిక ప్రగతికి పుల్ స్టాప్ పెట్టినట్టయిందని, దీనికి ప్రతిపక్షాలు పూర్తి బాధ్యతను వహించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ చరిత్రాత్మక సంస్కరణకు మద్దతు ఇచ్చివుంటే మహిళా సాధికారత, ప్రజాస్వామ్య విలువల పట్ల సామూహిక నిబద్ధత నిస్సందేహంగా ప్రదర్శితం అయ్యేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఎన్డీఏ మిత్రపక్షంగా తాము ఈ బిల్లును పార్లమెంటుకు తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజనరీ నాయకత్వాన్ని స్వాగతించామని గుర్తు చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందివుంటే కోట్లాదిమంది మహిళలకు గర్వకారణంగా నిలిచేదని, ప్రగతిశీల క్షణంగా నిలిచేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చట్టసభల్లో మహిళలు తమ అర్హతకు తగిన, బలోపేతమైన స్థానాన్ని పొందుతారని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.
Please stop lying to citizens just to please Modi. Women reservation bill was approved in 2023 itself. It can be passed even now . But your gang wanted to pass Delimitation bill which would weaken the representation of South Indian states including Andhra Pradesh. Requesting you… https://t.co/LyQGy2Fh8E
— Prakash Raj (@prakashraaj) April 18, 2026
ఈ ట్వీట్ కు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రిప్లై ఇఛ్చారు. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం పవన్ కల్యాణ్ ఏకంగా కోట్లాదిమంది దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎదురుదాడికి దిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని గుర్తు చేశారు. ఎటువంటి సవరణలు లేని నాటి బిల్లును ఇప్పుడు కూడా ఆమోదించవచ్చని అన్నారు.
డీలిమిటేషన్ బిల్లుతో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరిచేందుకు జనసేన పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రయత్నిస్తోందనే ఆరోపణ ఉందని, దీనికి సమాధానం చెప్పాలని ప్రకాష్ రాజ్ అన్నారు. పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎంగా చేసిన ఏపీ ప్రజల ఆత్మగౌరవం, రాష్ట్ర హక్కులు పణంగా పెట్టవద్దని కోరారు. ఈ విషయాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని, పవన్ కల్యాణ్ దీనికి సిద్ధమా అని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications