నేను-జనం-మనం: రాజకీయాలపై పుస్తకం రాస్తున్న పవన్ కళ్యాణ్
అమరావతి: 'జనం మనం' పేరుతో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో పుస్తకం రాస్తున్నారు. ఈ పుస్తకంలో పవన్ కళ్యాణ్ 'రాజకీయాలు ఎలా ఉండాలి?' అన్న అంశాన్ని ఆయన ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ పుస్తకంలో తన రాజకీయ కార్యాచరణపై పవన్ స్పష్టత ఇవ్వనున్నారు.
'మార్పుకోసం యుద్ధం' అనేది ఈ బుక్కు ట్యాగ్లైన్గా పెడుతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ప్రదమార్ధంలో ఈ పుస్తకం విడుదల కానుందని సమాచారం. ఈ పుస్తకం ద్వారా జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీ సిద్ధాంతాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేన ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఈ పుస్తకంలో పవన్ వివరించనున్నారు.

పార్టీ లక్ష్యాలు, ప్రేరేపించిన పరిస్థితులను ఈ పుస్తకంలో ప్రజలకు కూలంకుషంగా వివరించనున్నారు. జనసేన సిద్ధాంతాలన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పుస్తకాన్ని పవన్ రచిస్తున్నారు. ఇజం పుస్తకంతో పోలిస్తే మరింత క్లారిటీగా పలు అంశాలను ఈ పుస్తకం ద్వారా పవన్ ప్రజలకు వివరించనున్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే 'ఇజం' పేరుతో ఓ పుస్తకాన్ని రాసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాకినాడ సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా అభిమాని ఒకరు మృతి చెందిన నేపథ్యంలో ఇకపై బహిరంగ సభలను నిర్వహించనని పేర్కొన్నారు. తన అభిమాని వెంకటరమణ మృతి తీవ్రంగా కలచి వేసిందని అన్న పవన్ తన వల్ల ఎవరూ నష్టపోవడం ఇష్టం ఉండదని చెప్పారు.
ఉద్యమానికి వేరే మార్గాన్ని ఆలోచిస్తానని తెలిపారు. సభల్లో కార్యకర్తలు ప్రమాదాల బారిన పడి మృతి చెందడంతో పవన్ ఎంతో ఆవేదనకు గురైన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమా చేస్తూనే, మరోపక్క తన కొత్త పుస్తక రచన పనిలో బిజీబిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications