జగన్ ఉచ్చులో పవన్, జనసేనానికి టీడీపీ, మంత్రుల సీరియస్ వార్నింగ్
Recommended Video
అమరావతి: కాపు రిజర్వేషన్లపై మాట్లాడిన జగన్, రాజధాని రైతులకు అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై టీడీపీ నేతలు ఆదివారం విమర్శల వర్షం కురిపించారు.
చదవండి: నేను పర్సనల్ మాట్లాడితే, బ్రహ్మచారులా, జగన్! నేను ఊపేసేవాడిని: బాబు-రాహుల్లను ఏకేసిన పవన్
పవన్ అలా ఎలా మాట్లాడుతారు?
బీసీలకు అన్యాయం చేయకుండా కాపు రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. లీగల్ స్క్రూటిని నిలబడేలా కాపు రిజర్వేషన్ బిల్లు పెడతామన్నారు. బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్న జగన్, పవన్ కాపు రిజర్వేషన్లపై మోడీని ఒప్పించాలని డిమాండ్ చేసారు. వైయస్ హయాంలో కాపు, బలిజ సీట్లు వేరే వాళ్లకు ఇచ్చారన్నారు. కాపులకు అన్యాయం చేసే నైజం జగన్ది అన్నారు. రాజధానిని అడ్డుకుంటామని పవన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. నాలుగేళ్లయినా జనసేన విధివిధానాలు ప్రకటించలేదన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామని పవన్ చెప్పవచ్చునని, కానీ విషబీజాలు నాటడం సరికాదన్నారు.
అందుకే రాజధానిలో భూసేకరణ: యనమల
కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలు చూస్తేనే ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఎంతుందో అర్థమవుతోందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలకు, డిమాండ్లకు అనుగుణంగా చట్టాలు, రాజ్యాంగం మార్చుకోవచ్చునని చెప్పారు. 9వ షెడ్యూల్లో కాపు రిజర్వేషన్ బిల్లులు చేర్చారని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. పవన్, జగన్ అధికారంలో కూర్చునే ప్రయత్నం చేస్తూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు సరైన పాత్ర పోషించాలన్నారు. అమరావతి కోసం రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారని, కొంతమంది ఇవ్వలేదని, వారి కోసం భూసేకరణ అన్నారు. రైతులందరూ ఇచ్చి, అక్కడక్కడ మధ్యలో ఇవ్వకుంటే రాజధాని అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే: పవన్కు నారాయణ హెచ్చరిక
రాజధానిపై పవన్ వ్యాఖ్యలు సరికాదని మంత్రి నారాయణ నెల్లూరులో అన్నారు. రైతుల త్యాగాలను పవన్ అవమానిస్తున్నారన్నారు. భూసమీకరణ, రైతుల ప్యాకేజీపై ఆయనకు అవగాహన లేదన్నారు. వైసీపీ ఉచ్చులో చిక్కుకొని రైతులకు వ్యతిరేకంగా పవన్ మాట్లాడుతున్నారన్నారు. రాజధానిని ఆపేస్తామని, రైతులు తిరగబడాలని, రెచ్చగొట్టే ప్రకటనలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. జగన్ కాపుల ద్రోహి అని, ఆయన వైఖరి బట్టబయలు అయిందన్నారు. మోడీ దెబ్బకు మాట మారుస్తూ మడమ తిప్పుతున్నారన్నారు. మోడీని వ్యతిరేకించే దమ్ములేక కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదంటున్నారని ఆరోపించారు. వైయస్ కూడా చెల్లని జీవోలు ఇచ్చి కాపులను మోసం చేశారన్నారు. 50 శాతం రిజర్వేషన్లు దాటితే సాధ్యం కాదని జగన్ చెబుతున్నారని, తమిళనాడులో 68 శాతం ఉన్న విషయం తెలియదా అన్నారు. మొదటి నుంచి కాపులు, బలిజలు అంటే జగన్ కుటుంబానికి చిన్నచూపు అన్నారు.