పవన్ కళ్యాణ్-జూ.ఎన్టీఆర్: చంద్రబాబుకు ఎవరి వల్ల లాభం, ఎలా?
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లలో ఎవరి వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇటీవల జూ.ఎన్టీఆర్ను టిడిపి నేతలు పుష్కరాలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను చంద్రబాబు పక్కన పెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇదే సమయంలో, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్లలో ఎవరి వల్ల టిడిపికి ఎక్కువ లాభం అనే చర్చ జోరుగా సాగుతోంది. 2019లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున జూనియర్ ప్రచారం చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ టిడిపి-బిజెపి కూటమికి మద్దతిచ్చారు.
ఇన్నాళ్లుగా పక్కన పెట్టిన జూనియర్ ఎన్టీఆర్కు మరోసారి టిడిపి నేతలు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో, ఆ ఇద్దరిలో ఎవరి వల్ల టిడిపికి ఎక్కువ లబ్ధి అనే లెక్కలు వేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తే జూ.ఎన్టీఆర్ కంటే పవన్ కళ్యాణ్తోనే టిడిపికి ఎక్కువ లాభమనే వాదనలు వినిపిస్తున్నాయి.

తటస్థ ఓటర్లు
జూ.ఎన్టీఆర్.. నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి. కాబట్టి మొదటి నుంచి టిడిపి వైపు ఉన్న ఓటర్లు ఎలాగు ఉంటారు. తటస్థ ఓటర్లను మాత్రం ఆయన టిడిపి వైపు మళ్లించలేరని అంటున్నారు. అదే సమయంలో టిడిపికి లేదా నందమూరి కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని పవన్ కళ్యాణ్ వల్లనే టిడిపికి ఒకింత ఎక్కువ లబ్ధి అంటున్నారు.

పవన్ సామాజిక వర్గం ఓట్లు
పవన్ కళ్యాణ్కు కుల, మత పట్టింపులు ఉండవు. కానీ ఆయన మద్దతు ఉంటే ఆ సామాజిక వర్గం ఓట్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపడం ఖాయమని అంటున్నారు. 2014లో కాపులు చంద్రబాబుకు మద్దతు పలకడం.. పవన్ కళ్యాణ్ పుణ్యమే అంటున్నారు.

2019లో ఎలా ఉండేనో?
పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగా చాలామంది కాపులు గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపికి ఓటు వేశారు. అయితే, కాపు రిజర్వేషన్ల అంశం ఇటీవల బాగా రాజుకుంది. ఈ నేపథ్యలో 2019లో పవన్ మద్దతిచ్చినా ఏ మేర ఉపయోగపడుతుందో అప్పుడే తేలనుందని అంటున్నారు. కాపు రిజర్వేషన్ పైన పవన్ పలుమార్లు స్పందించారు.

స్టార్ అట్రాక్షన్
పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ తెలుగు టాప్ హీరోలే. కాబట్టి వారు ప్రచారం చేస్తే వారి సభలకు పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారు. ఇద్దరూ క్రౌడ్ పుల్లర్స్ అని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications