గ్రామ సచివాలయాలపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశం..! ప్రమోషన్లపైనా..!
ఏపీలో సచివాలయాల వ్యవస్ద ప్రక్షాళన కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సచివాలయాల హేతుబద్ధీకరణ, ఉద్యోగుల వర్గీకరణ సహా పలు నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు వారికి అప్పగించే విధులు, ఉద్యోగుల ప్రమోషన్లపై ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలపై ఇవాళ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ మంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో గ్రామ సచివాలయాల పని తీరు, నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గ్రామ స్థాయిలో వివిధ శాఖల నిర్మాణం, సచివాలయం ఉద్యోగులను ఆయా శాఖలకు ఎలా అనుసంధానించాలనే అంశంపైనా కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ మధ్యాహ్నం మంత్రుల బృందంతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈ అంశాలపై పవన్ చర్చించారు.

మంత్రులు పొంగూరు నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మిడి సంధ్యారాణితో పవన్ గ్రామ సచివాలయాలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖల్లో అనుసంధానించడానికి ఉన్న అవకాశాలపై మంత్రుల బృందం, ఆయా శాఖల ఉన్నతాధికారులతో పవన్ చర్చించారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినప్పటికీ సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ మొత్తం ప్రక్రియపై వచ్చే మార్చి నాటికి పూర్తి అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవసరమైన పక్షంలో ప్రతి నెలా ఒకసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లపై చర్చిద్దామని పవన్ సూచించారు.












Click it and Unblock the Notifications