టాలీవుడ్ తీరుపై పవన్ ఫైర్..! రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్స్..! ఇక దబిడి దిబిడే..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరి హర వీరమల్లు రిలీజ్ దగ్గరపడుతున్న వేళ నిర్మాతలతో ఇబ్బందుల వల్ల థియేటర్లు మూసేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఆయన స్వయంగా పైర్ అయ్యారు. టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుంటే కృతజ్ఞత చూపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే వారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా సీఎం చంద్రబాబును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదన్నారు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం తప్ప, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదన్నారు. అందరూ కలసి రావాలని తాను కోరినా సానుకూలంగా స్పందించలేదన్నారు.00

టాలీవుడ్ అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాల్జేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయన్నారు. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయని గుర్తుచేశారు.
గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని, కక్ష సాధింపులకు దిగేదని పవన్ గుర్తుచేశారు. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? అని అడిగారు. ఎన్నికలకు ముందు తాను, చంద్రబాబు చెప్పిన విధంగానే- కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదన్నారు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందన్నారు. వ్వవస్థ బాగుండాలని, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం అన్నారు.

తెలుగు సినిమా రంగంవారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని తాను సూచించానన్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చని చెప్పాన్నారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉందని తెలిపారు.
సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న తనకు తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామన్నారు. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించిందని,. అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని తాను ఆలోచన చేశానన్నారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానన్నారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారన్నారు. తన పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటి కొన్ని చర్చలు చేశారని, ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతోపాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను ఇప్పటికే చర్చించారన్నారు.
థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు చెప్పారని, లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని సూచించామన్నారు. రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపైనా చర్చించామన్నారు. టికెట్ సేల్ కీ, వచ్చే పన్నుకీ అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించామన్నారు.
అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో - సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచి నీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం. వీటిపైనా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామన్నారు. ఈ మేరకు తూనికలు కొలతల అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందనున్నాయని తెలిపారు.
చిత్రపరిశ్రమ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
— Kandula Durgesh (@kanduladurgesh) May 24, 2025
సినీ రంగాన్ని అడ్డుపెట్టుకుని అనవసరంగా వివాదాలు సృష్టించేందుకు చేసే ప్రయత్నాలను సహించం. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయంపై హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం. పరిశ్రమకు నష్టం వాటిల్లకుండా, డిస్ట్రిబ్యూటర్లు,… pic.twitter.com/FVvJwhNvKt
ఈ అంశాలపై త్వరలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, హోమ్ శాఖ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో చర్చిస్తానన్నారు.రాష్ట్రంలో మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను నివేదిక అడిగామని,కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా రెండుమూడు స్క్రీన్స్ గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారని తెలిపారు. వాటిలో టికెట్ ధరలు, సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? కౌంటర్ లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నామన్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ ల నిర్వహణ వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారిస్తామన్నారు.












Click it and Unblock the Notifications