'కిరణ్, పవన్ పార్టీల ప్రభావమెంత: ఎవరెటు వెళ్తారు?'
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెట్టబోయే కొత్త పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయని ఇతర పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. కిరణ్ కొత్తగా జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించడంతో, ఆ పార్టీ ప్రభావం ఎంత? ఎంతమంది వెంట ఉన్నారు? తదితర అంశాలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దృష్టి సారించింది.
సోమవారం కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీని ప్రకటించిన కొద్దిసేపటికే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి గాంధీ భవన్లో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. కిరణ్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో సమైక్యాంధ్ర హామీ ఒక్కటేనా, ఇంకా ఏమేమీ హామీలు ఉన్నాయా, కాంగ్రెస్ నుంచి ఎంత మంది నాయకులు ఆయనతో పాటు వెళతారు, ఆ పార్టీ నిలదొక్కుకుంటుందా? తదితర అంశాలపై వారు చర్చించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ పార్టీ విషయమై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరూ కిరణ్ పార్టీలోకి వెళ్ళకుండా చూడాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరైనా వెళ్ళాలన్న ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు వస్తే, వారిని నిలువరించే బాధ్యతను ఆయా జిల్లా ముఖ్య నాయకులు, జిల్లా తాజా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉంచాలని వారు ఆలోచన చేసినట్లు సమాచారం.
కాగా, కిరణ్ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడినవారు, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో టిక్కెట్లు దక్కని అసంతృప్తివాదులు కొత్త పార్టీల కోసం వేచి చూస్తున్నారు. ఇటు కిరణ్ పార్టీ, అటు పవన్ పార్టీలు రెండూ త్వరలోనే ఎన్నికల బరిలో దిగనున్న నేపథ్యంలో ఎటువైపు బలముందన్న విషయంపై తటస్థంగా ఉన్న నేతలు ఆరా తీస్తున్నారు.
ఈ నెల 12న రాజమండ్రిలో జరుగనున్న జై సమైక్యాంధ్ర పార్టీ విధివిధానాలను, గుర్తులను ప్రకటించిన తరువాత కొంతమంది నిర్ణయం తీసుకుని ఆ పార్టీలో చేరే అవకాశం కన్పిస్తోంది. అయితే బలిజ సామాజిక వర్గానికి చెందిన తటస్థ నేతలు మాత్రం పవన్ కల్యాణ్ పార్టీ వైపు చూస్తున్నారట.












Click it and Unblock the Notifications