అభివృద్ధి, టి-సీమాంధ్ర: మోడీతో భేటీలో పవన్ కళ్యాణ్
హైదరాబాద్/న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీ అయి... తెలుగు జాతి అభివృద్ధిపై చర్చించనున్నారని తెలుస్తోంది. మోడీతో భేటీ కోసం పవన్ అహ్మదాబాద్ చేరుకున్నారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి నిర్వహణ, వైద్యం, విద్య, యువతకు ఉద్యోగాలు తదితర అంశాల పైన చర్చించనున్నారు. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ, రైతుల ఆత్మహత్యలు, సామాన్యుల ఆరోగ్యం.. తదితర విషయాలలో ఏం చేయాలనే దానిపై మోడీతో పవన్ పంచుకోనున్నారు.

ఈ సమస్యలన్నింటి పైన మోడీతో పవన్ చర్చిస్తారు. పవన్ గురువారం సాయంత్రం 6.20 గంటలకు అహ్మదాబాద్ చేరుకున్నారు. మోడీతో భేటీ సందర్భంగా రాజకీయాలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిపై తనకున్న ఆలోచలను పవన్ పంచుకుంటారు. ఆయన మద్దతు కోరుతారు.
ఎన్నికల అనంతరం బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలుగు జాతి అభివృద్ధికి ఏం చేయాలి? ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి? తదితర అంశాలపై తన ఆలోచనలను చెబుతారు. అదే సమయంలో మోడీ అభిప్రాయాలు కూడా పవన్ తెలుసుకోనున్నారు. రైతు ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు గుజరాత్లో చాలా తక్కువ. ఇందుకు మోడీ అనుసరిస్తున్న విధానాలను కూడా పవన్ తెలుసుకోనున్నారు. మోడీతో భేటీ అనంతరం పవన్ తన పర్యటన వివరాలు తెలియజేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications