జనసేన పొత్తుపై మోడీ? కనిపించని పవన్ సైలెంట్గా...
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ త్వరలో సీమాంధ్రలో పర్యటిస్తారని, ఆయన సీమాంధ్ర పర్యటన సమయంలోనే టిడిపి, జనసేన పార్టీలతో పొత్తుల విషయం ప్రస్తావిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టిడిపి, బిజెపిల మధ్య పొత్తు పొడుస్తోంది. సీట్ల విషయమై వారి మధ్య తర్జన భర్జన జరుగుతోంది.
పవన్ కూడా టిడిపికి అనుకూలంగా ఉన్నారంటున్నారు. అదే సమయంలో మోడీని కలవనున్నారట. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యనకు వచ్చినప్పుడు పొత్తులపై ప్రకటన చేసే అవకాశముందంటున్నారు. జనసేన, టిడిపి, బిజెపిల మధ్య పొత్తును బహిరంగ సభ వేదిక పైనే ప్రకటించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
కాగా, కాంగ్రెసు కో హఠావో అని చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టిడిపి - బిజెపిలతో కలిసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల కోసం టిడిపి, బిజెపి మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ఇవి కొలిక్కి వచ్చాయి.
ఇదే సమయంలో పవన్ కూడా వారితో పొత్తుల దిశగా కదులుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. ఈ నెల 14న హైదరాబాద్లో జనసేనను ప్రారంభించిన పవన్ కాంగ్రెస్ హఠావో, దేశ్ బచావో అని పిలుపు ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి, జై సమైక్యాంధ్ర పార్టీలు కాంగ్రెస్కు వ్యతిరేకమే. అయితే, పవన్ చూపు టిడిపి వైపు ఉన్నట్లుగా ఆయన తీరును బట్టి అర్థమవుతోందంటున్నారు.

టిడిపి, బిజెపి కూటమిలో తాను సైతం కలిసేందుకు పవన్ తన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. పవన్ రాష్ట్రంలో చంద్రబాబు, జాతీయ స్థాయిలో మోడీకి అనుకూలమనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత పవన్ మళ్లీ పబ్లిక్లో కనిపించ లేదు. పవన్ పార్టీ అజెండా ఏమిటి? ఆయన పేల్చే బుల్లెట్ ఏ లక్ష్యం దిశగా సాగుతుంది? ఇంతకీ పవన్ తన అభిమానులకు చేసిన దిశా నిర్దేశం ఏమిటి? వంటి అంశాలపై చర్చ జోరుగా జరుగుతోంది.
మరోవైపు పవన్ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నారు. కలవాల్సిన వారిని కలుస్తూ, మాట్లాడాల్సిన వారితో మాట్లాడుతున్నారు. పార్టీ ప్రారంభించిన మరుసటి రోజునే పవన్ హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలుస్తోంది. పార్టీ, రాజకీయాలు, టిడిపితో కలిసి పని చేయడంపై తన ఆలోచనలు పంచుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబును పవన్ వ్యక్తిగతంగా కలవడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక పవన్ ఇప్పటికే ఢిల్లీలో బిజెపి అగ్రనేతలను కలిసి కూటమి గురించి చర్చించినట్లుగా కూడా చెబుతున్నారు. మోడీ ఇచ్చిన కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో నినాదమే పవన్ నోట కూడా వినిపించింది. ఇది బిజెపిని ఆకట్టుకుందంటున్నారు.
రెండు మూడు రోజుల్లో మరోసారి ఢిల్లీకి వెళ్లి మోడీతో భేటీ కావాలని పవన్ భావిస్తున్నారట. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా చేర్చుకోవాలని బిజెపి, ఇప్పటికే వీస్తున్న సానుకూల పవనాలకు పవన్ తోడైతే మంచిదేనని టిడిపి భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. పవన్కున్న ఇమేజ్, మోడీ మంత్రం, చంద్రబాబు నాయకత్వం ఈ మూడు కలిస్తే ప్రత్యర్థులను చిత్తు చేయడం ఖాయమన్న వాదన టీడీపీలో బలపడుతోంది.
పవన్ పొత్తు ప్రతిపాదనలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మోడీ సీమాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ను కూడా ఆహ్వానించి బహిరంగ సభ వేదికపైనే తమ పొత్తు గురించి ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications