పవన్ "జెఎఫ్ఎఫ్ సి నివేదిక"...అంతా తప్పులతడకే:ఐవైఆర్ సంచలనం
గుంటూరు:కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై ఆమధ్య కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జెఎఫ్ఎఫ్ సి కమిటి ఇచ్చిన నివేదిక తప్పులతడక అని ఎపి మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ నివేదిక కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టును ఆధారం చేసుకొని తయారుచేయబడిందని...అంతేతప్ప కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం తీసుకోలేదని ఐవైఆర్ ఆరోపించారు. నవ్యాంధ్ర మేధావుల ఫోరం ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఐవైఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కేంద్రం నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ తీసుకోనందువల్లే జెఎఫ్ఎఫ్ సి నివేదికలో అన్నీ తప్పులే ఉన్నాయన్నారు.
విభజన హామీలపై కేంద్రానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాలని ఎపి ప్రభుత్వానికి కొంతమంది సూచిస్తున్నారని...అయితే అలా చేస్తే నష్టం జరుగుతుందన్నారు. లోటు బడ్జెట్ పై రాష్ట్ర నివేదిక చెల్లుబాటు కాదని తేల్చేశారు. రాజకీయంగా పరిష్కరించుకోవాల్సిన ఈ అంశాల్ని కోర్టులకు వెళ్లడం ద్వారా మరింత సంక్లిష్టం చేసుకోవడమేనని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.
అయితే కొంతకాలం కిందటే ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి అనే బుక్ ను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆ పుస్తక ఆవిష్కరణను పట్టుబట్టి మరీ పవన్ చేత ఆవిష్కరింపచేసిన ఐవైఆర్ ఉన్నట్టుండి పవన్ జెఎఫ్ఎఫ్సి నివేదికను తప్పుబట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.