మోడీ సభలో పవన్, బాబు: జవదేకర్, జగన్పై బాలకృష్ణ
హైదరాబాద్: హైదరాబాదులో మంగళవారం జరగనున్న బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సభలో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు పాల్గొంటారని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ సోమవారం చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయం ఖాయమన్నారు.
బిజెపితోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. చాయ్వాలాపై వ్యాఖ్యలు బెడిసికొట్టడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందన్నారు. ఎపిలో టిడిపితో పొత్తు నేపథ్యంలో సీట్ల విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. బిజెపికి కేటాయించిన స్థానాల్లో టిడిపి అభ్యర్థులు నామినేషన్ వేస్తే వాటిని ఉపసంహరించుకుంటారని చెప్పారు.
థర్డ్ ఫ్రంట్ నాయకులు తెలంగాణను వ్యతిరేకించారని అన్నారు. అటువంటి నాయకులతో కెసిఆర్ కలుస్తారా అని ప్రశ్నించారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు మోడీతోనే సాధ్యమన్నారు. కెసిఆర్ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. పెరుగుతున్న ఓటింగ్ శాతం బిజెపికి కలిసి వస్తుందన్నారు.
శ్రీకాకుళంలో బాలయ్య ప్రచారం
రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో టిడిపి నేత, హీరో నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు. జగన్ పార్టీ, కాంగ్రెసు పార్టీలకు కాలం చెల్లిందన్నారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలంటే ఓటర్లు కాదని.. ప్రజలంటే ప్రభంజనమన్నారు. టిడిపి ఎప్పటికీ రైతుల పార్టీయేనన్నారు. యువతకు ఉద్యోగం రావాలంటే టిడిపి అధికారంలోకి రావాలన్నారు. మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చుతామన్నారు.