టార్గెట్ కాపు.. మూడింటికి ముగ్గురు!: దాసరితో చిరు-బాబులను జగన్ కార్నర్ చేస్తారా?
విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం దర్శకరత్న దాసరి నారాయణ రావును కలవడం చర్చనీయాంశమైంది. కేవలం మర్యాద పూర్వకంగానే కలిసినట్లు చెప్పినా రాజకీయ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని పలువురు భావిస్తున్నారు.
దాసరిని జగన్ కలవడం... ఏపీలో ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి, మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీకి ఝలక్ అని అంటున్నారు. మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిరంజీవి పార్టీలోకి వచ్చాక.. దాసరి ప్రాధాన్యత తగ్గిపోయిందనే వాదనలు ఉన్నాయి.
ఇరువురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అంతకుముందు ఆ సామాజిక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ దాసరిని ఉపయోగించుకుందని, చిరంజీవి తన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక... దాసరికి ప్రాధాన్యం తగ్గిపోయిందని అంటుంటారు. ఈ నేపథ్యంలో దాసరి పార్టీకి దూరం జరిగారు.
వైసిపిలో చేరుతారా?
దాసరి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. ఇప్పుడు జగన్ భేటీ నేపథ్యంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనే చర్చకు దారి తీసింది. బయటకు చెప్పనప్పటికీ ఆ దిశలో చర్చలు జరిగి ఉంటాయని చాలామంది భావిస్తున్నారు.
వైసిపికి ప్రధానంగా రెడ్డి ముద్ర ఉంది. ఈ నేపథ్యంలో కాపులకు తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా దాసరిని తమ పార్టీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తుండవచ్చునని అంటున్నారు. అయితే, దాసరి ఆలోచించుకునేందుకు సమయం కోరి ఉంటారని చెబుతున్నారు.
టిడిపికి పవన్ కళ్యాణ్, కాంగ్రెస్కు చిరు: జగన్కు దాసరి!
ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు టిడిపి-బిజెపి మిత్రపక్షాలకు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ చూపు దాసరి నారాయణ రావు వైపు మళ్లి ఉంటుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమికి మెజార్టీ కాపులు ఓటు వేశారని చెప్పవచ్చు.
చంద్రబాబుకు దాసరి షాక్!
ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష పార్టీగా వైసిపి ఉంది. టిడిపి పైన జగన్ నిత్యం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్పై దాసరి ప్రశంసలు కురిపించడం చంద్రబాబుకు షాకే అని అంటున్నారు. ప్రజా సమస్యల పైన జగన్ బాగా పోరాడుతున్నారని దాసరి కితాబివ్వడం గమనార్హం.