పరిటాల సునీత పదవికి పయ్యావుల ఎసరు!, మంత్రి పదవి దక్కేనా!!
అనంతపురం : దసరా తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్వయంగా సీఎం చంద్రబాబే ప్రకటించిన నేపథ్యంలో.. మంత్రి పదవి ఆశిస్తోన్న ఆశావహుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయా జిల్లాల్లో కొంతమంది నేతలు మంత్రి పదవి ఆశిస్తుండడంతో.. కేబినెట్ నుంచి ఎవరికి ఉద్వాసన పలుకుతారనేది ప్రస్తుతం చర్చల్లో నానుతున్న అంశం.
ఈ నేపథ్యంలో అనంతపురం రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మంత్రి పదవిని ఆశిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ముందునుంచి పార్టీకి విధేయుడిగా వస్తున్న పయ్యావులకు మంత్రి పదవి ఇవ్వాలనే విషయంలో సీఎం చంద్రబాబు కూడా ఒకింత సానుకూలంగానే ఉన్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

ఇదే క్రమంలో.. ఒకవేళ పయ్యావులకు కేబినెట్ బెర్త్ ఖరారైతే ఇప్పటికే జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీతల్లో ఎవరిపై వేటు పడుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక పనితీరు విషయంలో మంత్రి పల్లెతో పోల్చి చూస్తే.. పరిటాల సునీత కాస్త వెనుకబడే ఉన్నారన్న మాట కూడా వినిపిస్తోంది. దీంతో పయ్యావుల పదవి పరిటాల సునీతకు ఎసరు పెట్టేలా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఊహాగానాలే అయినా.. ఒకవేళ ఇదే పరిస్థితి తలెత్తితే కేబినెట్ నుంచి పరిటాల సునీతను తప్పించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తారా? అన్నది కూడా అనుమానమే.












Click it and Unblock the Notifications