కుర్చీ కోసమే: జైపాల్ రెడ్డిపై పయ్యావుల ధ్వజం
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం రాయలసీమ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లు మౌనంగా ఉన్న జైపాల్ రెడ్డి తెలంగాణ ఏర్పడితే ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పుకోవడానికే ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును తిరస్కరించడాన్ని తప్పు పట్టడం సరి కాదని ఆయన అన్నారు. మూజువాణి ఓటుతో చేసే తీర్మానాలు చెల్లకపోతే చాలా చట్టాలు చెల్లవని, మొదటి ఎస్సార్సీ ప్రకారం మూజువాణీ ఓటుతో రాష్ట్రాల విభజనకు తెలిపిన ఆమోదాలు కూడా చెల్లవని ఆయన అన్నారు. విభజన విషయంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైపాల్ రెడ్డి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రపతిని కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సుశీల్ కుమార్ షిండే రబ్బర్ స్టాంపుగా భావిస్తున్నారా అని ఆయన అడిగారు. తెలంగాణవాదాన్ని కొంత మంది కేంద్ర మంత్రులు భుజాన వేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరు కేంద్రమంత్రులపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. పార్లమెంటుకు బిల్లును పంపించాల్సింది రాష్ట్రపతి అని, దానిపై కేంద్ర మంత్రులు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. అన్నీ వారు చెప్పినట్లే జరుగుతాయా అని ఆయన అడిగారు.
విభజన బిల్లు విషయంలో శాసనసభ తన బాధ్యతను నిర్వహించిందని, ఇక కేంద్ర మంత్రులదే బాధ్యత అని ఆయన అన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివ రావు మొదలుకొని పనబాక లక్ష్మి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి పనచేయాలని ఆయన అన్నారు. లేకుంటే వారి వారసులు కూడా రాజకీయాల్లోకి రాకుండా శిలఫలకాలు పెడతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications