ఏపీ ఆర్ధిక పరిస్థితిపై గవర్నర్ కు ఫిర్యాదు.. సంచలన ఆరోపణలు చేసిన పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతోందని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో చిక్కుకుందని ఇప్పటికే టీడీపీ నేతలు పలుమార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై పీఏసీ చైర్మన్, టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని అప్పులపై యనమల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రెండేళ్లలో ఆర్థికశాఖలో జమా, ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయని పయ్యావుల కేశవ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు రెండేళ్లకు సంబంధించిన ఆర్థికశాఖ రికార్డులను స్పెషల్ గా ఆడిటింగ్ చేయించాలని ఆయన గవర్నర్ ను కోరారు. 40 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలలో, అకౌంటింగ్ ప్రొసీజర్ లలో తప్పిదాలు జరిగాయని పయ్యావుల కేశవ్ ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు ఆర్థిక లావాదేవీలలో అవకతవకలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి తాను రాసిన లేఖ ప్రతిని గవర్నర్ కు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా ఆర్థిక పరమైన జమా ఖర్చుల నిర్వహణపై గవర్నర్ దృష్టిసారించాలని పయ్యావుల కేశవ్ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు .ఇదిలా ఉంటే ఏపీ ఆర్థిక పరిస్థితి పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతాయని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.
Recommended Video
ఏప్రిల్ మాసంలో రాష్ట్ర ఆర్థిక శాఖ సమర్పించిన అప్పుల నివేదిక చూసి కేంద్ర అధికారులే విస్తుపోయారు అని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇదే సమయంలో తెచ్చిన అప్పులు, వేస్తున్న పన్నులు , పెంచిన ధరల తో ఒక్కో కుటుంబంపై 2.5 లక్షల భారం పడనుందని యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల భారం అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2020-2021 ఆర్థిక సంవత్సరంలో పది నెలల లెక్కలను కాగ్ తన నివేదిక ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. అంచనాల కన్నా 153 శాతం అధికంగా ఏపీ అప్పులు ఉన్నాయని గతంలోనే కాగ్ తేల్చింది.












Click it and Unblock the Notifications