ఏపీపీఎస్సీ ఛైర్మన్ ను తొలిగించాలి: లక్షలాది నిరుద్యోగులు నష్టపోయారు: గవర్నర్ వద్దకు చేరిన పంచాయితీ..
కొద్ది కాలంగా ప్రభుత్వంలో అంతర్గతంగా సాగుతన్న వ్యవహరం ఇప్పుడు గవర్నర్ వద్దకు చేరింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ తీరు పైన ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం. అయితే తాజాగా ఏకంగా అయిదుగురు ఎమ్మెల్సీలు నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ ను తొలగించాలని గవర్నర్ హరిచందన్ కు ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఫిర్యాదు చేసారు. ఛైర్మన్ నియంతృత్వ విధానాల వల్ల ఐదేళ్లుగా లక్షలాది విద్యార్ధులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వైఖరి కారణంగా లక్షలాది మంది గ్రామీణ విద్యార్ధులు నష్టపోయారని వివరించారు. ఇప్పుడు ఈ వ్యవహారం ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారింది.
ఛైర్మన్ ను తొలిగించండి..
ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ ను తొలగించాలని గవర్నర్ హరిచందన్ కు ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఫిర్యాదు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీలు వై.శ్రీనివాసులరెడ్డి, ఐ.వెంకటేశ్వరరావు, కె.ఎస్.లక్ష్మణరావు, వి.బాలసుబ్రహ్మణ్యం, రాము సూర్యారావు గవర్నర్ ను కలిసారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ వ్యవహార శైలి..ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల గురించి వివరించారు.
ఛైర్మన్ నియంతృత్వ విధానాల వల్ల ఐదేళ్లుగా లక్షలాది విద్యార్ధులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇష్టానుసారంగా సిలబస్ లు మార్చేశారని, సిలబస్ కూ ప్రశ్నాపత్రాలకు సంబంధం లేకుండా చేశారని గవర్నర్ కు వివరించారు. నెగెటివ్ మార్కింగ్ విధానం వల్ల గ్రామీణ విద్యార్ధులు నష్టపోయారని ఎమ్మెల్సీలు గవర్నర్ కు నివేదించారు. దీని పైన గవర్నర్ వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ మీద నేరుగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేయటం..నిరుద్యోగులు..విద్యార్ధులు నష్టపోతున్నారని చెప్పటంతో గవర్నర్ దీని పైన పూర్తి స్థాయిలో నివేదిక కోరినట్లు సమాచారం.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా పిన్నమనేని ఉదయభాస్కర్ ను నియమించారు. టీడీపీ హాయంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నా..ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులును నియమించి..ఆయన ద్వారా మొత్తం కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు ఇంటర్వ్యూ విధానం రద్దు నిర్ణయం సైతం ఆయన ఆధ్వర్యంలోనే జరగింది. ఇక, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సచివాలయ పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని..ఏపీపీఎస్సీలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగి ప్రశ్నా పత్రాలను టైప్ చేసిందని..ఆమెకే ఫలితాల్లో తొలి ర్యాంకు వచ్చిదంటూ ప్రతిపక్షాలు ..కొన్ని పత్రికలు ఆరోపణలు చేసాయి. ఆ సమయంలో అసలు ఏపీపీఎస్సీకి ఈ పరీక్షకు సంబంధం లేదనే విషయాన్ని ఛైర్మన్ చాలా ఆలస్యంగా వివరణ ఇవ్వటం పైన ప్రభుత్వంలో అప్పుడే చర్చ జరిగింది. ఇక, ఇప్పుడు ఈ వ్యవహారం గవర్నర్ వద్దకు వెళ్లటంతో ఇక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications