గుంటూరులో విచిత్రమైన ఫిర్యాదు: తలలు పట్టుకున్న పోలీసులు
అమరావతి: మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే కొన్ని రోజులు సంతోషంగా గడుపుతాం. ఆ తర్వాత వాళ్లు ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తాంటాం. ఎందుకంటే చుట్టాలు రావడం వల్ల ఆర్ధికపరమైన ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వస్తుంది. సరిగ్గా ఇలాంటి ఒత్తిడినే ఎదుర్కొన్న సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
నా ఇంటికి చుట్టుపు చూపుగా వచ్చిన మనవుడు, మనవరాలిని తరిమేయాలంటూ ఓ మాజీ సైనికుడు ఇచ్చిన ఫిర్యాదు గుంటూరు జిల్లా పోలీసులను తలలు పట్టుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలోని ఆర్ఎంఎస్ కాలనీలో నివాసం ఉండే కొర్రపాటి విజయేందర్రావు సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు.
ప్రస్తుతం తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. అయితే వేసవి సెలవులు కావడంతో విజయేందర్రావు మనవడు, మనవరాలు పిల్లలతో సహా ఆయన ఇంటికి వచ్చారు. అయితే వారు ఎన్నిరోజులైనా వెళ్లకపోవడంతో విసుగు చెందిన విజయేందర్రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన ఇంటికి బంధువులు వచ్చారని, వారు ఎన్ని రోజులైనా వెళ్లకుండా తన ఇంట్లోనే తిష్టవేసి తింటున్నారని, వారి మూలంగా అప్పులపాలవుతున్నానని విజయేందర్రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన మనవడు, మనవరాలు, వారి పిల్లలను ఎలాగైనా తన ఇంటి నుంచి పంపి వేయాలని పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తొలిసారిగా ఇలాంటి విచిత్రమైన ఫిర్యాదు రావడంతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. 'మీ బంధువులను మీరే పంపించేయొచ్చు కదా' అని విజయేందర్రావుతో పోలీసులు చెప్పగా వాళ్లు తన మాట వినరని, మీరే కేసు నమోదు చేసి వాళ్లని ఎలాగైనా తన ఇంటి నుంచి పంపించి వేయాలని వేడుకున్నాడు.
ఉదయం కేసు పెట్టిన విజయేందర్రావు మళ్లీ సాయంత్రమే స్టేషన్కు వెళ్లి నిలదీసేసరికి ఏం చేయాలో పాలుపోక పోలీసులు మౌనంగా ఉండిపోయారు. ఇంతవరకు ఇలాంటి విచిత్రమైన ఫిర్యాదుని వినలేదని, ఇలా తొలిసారిగా జరగడంతో ఇదెక్కడి కేసురా బాబూ అంటూ పోలీసులు నవ్వుకుంటున్నారు.