సైకిళ్లపై తిరుగుతున్న ఏపీ కలెక్టర్లు- రీజన్ ఇదే..!
ఏపీలో ఈ మధ్య పలువురు జిల్లా కలెక్టర్లు సైకిల్ యాత్రలు చేస్తూ దర్శనమిస్తున్నారు. ఒక్కో కలెక్టర్ ఒక్కో కారణంతో ఇలాంటి యాత్రలు చేస్తున్నారు. ఒకరు ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు ర్యాలీ నిర్వహించగా.. మరో కలెక్టర్ ప్రతీ శనివారం సైకిల్ తొక్కుతూ ఆఫీసుకు వస్తున్నారు. వీరి యాత్రలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఐఏఎస్ హోదాలో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్నా వాటిని కాదని ఇలా సైకిళ్లపై తిరుగుతూ చైతన్యం నింపడం ప్రశంసలు అందుకుంటోంది.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఈ మధ్య ప్రతీ శనివారం కలెక్టరేట్ కు సైకిల్ పైనే వస్తున్నారు. సామాజిక బాధ్యతగా వ్యవహరించి ప్రతి శనివారం కార్యాలయ విధులకు సైకిల్ లేదా నడక ద్వారా రావాలని ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. దీన్ని ముందుగా తానే అమలు చేయాలని నిర్ణయించుకుని ప్రతీ శనివాసం కలెక్టర్ కార్యాలయానికి సైకిల్ పైనే వస్తున్నారు. దీంతో కృష్ణాజిల్లా కలెక్టరేట్ లో ఉద్యోగులు కూడా ఇప్పుడు ఆయన్ను అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇలా కలెక్టర్ డీకే బాలాజీ ప్రతీ శనివారం సైకిల్ తొక్కుకుంటూ ఆఫీసుకు రావడమే కాదు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి నెలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నెలలో ప్రతి శనివారమూ కార్యాలయాల్లో శుభ్రత చేపట్టే విధంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్వచ్ఛఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దశలవారీగా శుభ్రం చేస్తూ కలెక్టరేట్ ను సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

గత నెలలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా పశ్చిమగోదారి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కూడా భీమవరంలో "ఫిట్ ఇండియా - సైక్లోథాన్" ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని విష్ణు కళాశాల నుండి జువ్వలపాలెంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ఐదు కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి ముందుగా సైకిల్ తొక్కగా.. ఎస్పీ, మిగిలిన అధికారులు ఆమెను అనుసరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి.. శారీరక దృఢత్వాన్ని ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం చేసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications