సీఎం కావడం ఏపీ దురదృష్టం: పెద్దిరెడ్డి, జేసీ వ్యాఖ్యతో బాబుకు చిక్కులు!
విజయవాడ: చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ప్రజలు చేసుకున్న దురదృష్టమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పార్థసారథిలు ఆదివారం నాడు దుమ్మెత్తి పోశారు.ఆయన అసమర్థత, చేతకానితనం వల్లే హోదా రావడం లేదన్నారు.
రాయలసీమలో పుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబులో ఇక్కడి రక్తం, పౌరుషం ఉంటే కనుక పార్టీ ఫిరాయించిన నేతలతో రాజీనామా చేయించి, వారిని మళ్లీ పోటీ చేయించాలన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రజల పక్షం అంటారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోతారని ఎద్దేవా చేశారు.య
ఏపీకి ప్రత్యేక హోదా పైన ప్రజలను చంద్రబాబు మోసగిస్తున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో కేంద్రంతోనూ, తెలంగాణతోనూ బాబు లాలూచీ పడ్డారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి ప్రభుత్వ కుట్రపూరిత ఆలోచనా విధానం బట్టబయలు అయిందన్నారు.
చంద్రబాబుకు ప్రత్యేక హోదా సాధించడంలో చిత్తశుద్ధి కొరవడిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పిందని, అయినప్పటికీ కేంద్రంలో ఆ పార్టీ ఉండటం సిగ్గుచేటు అన్నారు. ప్రత్యేక హోదా, బిజెపితో పొత్తు విషయంలో గానీ మాట్లాడవద్దని సొంత పార్టీ నేతలకు చంద్రబాబు సూచించడం సిగ్గుచేటు అన్నారు.
ప్రత్యేక హోదా రాదని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని, చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలుసునని, ఆయన చతురుడు కాబట్టి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చాడని సాక్షాత్తూ జేసీ వ్యాఖ్యానించారని పెద్దిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు ముందే తెలిస్తే.. టిడిపి ఈ రాష్ట్రానికి హోదా వద్దనుకుంటుందా అని నిలదీశారు.
ప్రతిపక్షాలు ఢిల్లీలో పోరాటం చేస్తుంటే చంద్రబాబు కూర్చుంటారా అని విమర్శించారు. ప్రత్యేక రోదా కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో పారాటం చేస్తుందని చెప్పారు. హోదా కోసం ప్రాణాలకు తెగించి పోరాడేది తమ పార్టీ అధినేత వైయస్ జగన్ మాత్రమే అన్నారు.