కుప్పంలో అటెండర్ తో పోటీచేయించి బాబును ఓడిస్తా.. పెద్దిరెడ్డి సవాల్; మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రతిసవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధం అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. తాజాగా చిత్తూరు వేదికగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనలో ఎన్నికల పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు, ఆపై ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడించి తీరుతామని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడుకి ఘాటుగా సమాధానమిచ్చారు.
అటెండర్ ను బరిలోకి దింపి చంద్రబాబును ఓడిస్తామన్న పెద్దిరెడ్డి
చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో డోసు పెంచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించారు. చంద్రబాబుకు దమ్ముంటే పుంగనూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. అంతేకాదు కుప్పంలో ఈసారి చంద్రబాబుకు పోటీగా తన అటెండర్ ను బరిలోకి దింపి చంద్రబాబును ఓడిస్తాం అంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు కుప్పంలో గెలవలేరని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు కుప్పం పర్యటనపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
కేవలం ఎన్నికల సమయంలోనే చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి వచ్చేవారని, కానీ ఇప్పుడు గ్రామాలు కూడా తిరగాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని చంద్రబాబు కుప్పం బాట పట్టడం తమ నైతిక విజయం అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఓడించటం పెద్ద విషయం కాదు అన్నట్టుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పందించారు.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ప్రతి సవాల్ చేసిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి
కుప్పంలో అటెండర్ ను చంద్రబాబుపై పోటీ చేయించి గెలిపిస్తా అన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అమర్నాథ్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. కుప్పం లో అటెండర్ ఎందుకు దమ్ముంటే నువ్వే పోటీ చేసి కుప్పంలో గెలిచి చూపించాలి అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రతి సవాల్ చేశారు అమర్నాథ్ రెడ్డి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రాకముందే ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్ల పర్వం చోటుచేసుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు .. దిద్దుబాటు బాట
ఇటీవల కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణమైన ఓటమిని చవి చూడటంతో చంద్రబాబు దిద్దుబాటు బాట పట్టారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, పట్టు కోసం పర్యటనలు చేస్తున్నారు. ప్రజా క్షేత్రంలో వైసీపీ దారుణాలను ఏకరువు పెడుతున్నారు. రెండు రోజుల పాటు సాగిన చంద్రబాబు పర్యటనలో ఆయన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడానికి శతవిధాల ప్రయత్నించారు. తాము అధికారంలోకి రావటం ఖాయమని తేల్చి చెప్పారు. ప్రజలు వైసీపీ తీరుతో విసిగిపోయారని స్పష్టం చేశారు.
చంద్రబాబుతో ఢీ అంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వైసిపి రౌడీయిజాన్ని, అరాచకాలను కుప్పం వేదికగా చంద్రబాబు ఎండగట్టారు. కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ చంద్రబాబు వైసీపీ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం చిత్తూరు జిల్లా రాజకీయాలలో కాక రేపుతోంది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్న చంద్రబాబుకు దీటుగా సమాధానం చెబుతూ చిత్తూరు జిల్లా నేత, వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుతో ఢీ కొడుతున్నారు.