పుంగనూరులో రాళ్ల దాడి- మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఉద్రిక్తతల మధ్య మొదలైంది. మూడు రోజుల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అన్ని మండలాలకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కుప్పం పర్యటన చేపట్టారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తత..
చంద్రబాబును సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు పోలీసులు. జీవో నంబర్ 1 గురించి వివరించారు. ఈ జీవో ప్రకారం- రోడ్ల మీద బహిరంగ సభలను నిర్వహించడానికి అనుమతి లేదని గర్తు చేశారు. అంతకుముందే- చంద్రబాబు రోడ్ షోగా తరలి వెళ్లాల్సిన వాహన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్టేషన్ కు తరలించారు. ఈ పరిణామాలు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు.

మంత్రి పెద్దిరెడ్డి ఫైర్..
ఈ ఘటన పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు వ్యవహారశైలి శవాలపై పేలాలు ఏరుకునేలా ఉందని ధ్వజమెత్తారు. పోలీసులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమని మండిపడ్డారు. ఆయన వల్ల రాజకీయ నేతల విలువ పోతోందని ఆరోపించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పుంగనూరులో సైతం రాళ్ల దాడికి దిగారని పెద్దిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసులను కొట్టాలంటూ..
ఈ మధ్యాహ్నం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సోమల మండలంలో పర్యటించారు. ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. వాటిని పరిష్కరించడానికి అక్కడికక్కడే అదేశాలు ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీసులను కొట్టాలంటూ చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. లాఠీఛార్జి జరగడానికి పూర్తి బాధ్యత ఆయనే వహించాలని డిమాండ్ చేశారు.

అధికారం ఉంటే చాలు..
కందుకురులో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు మహిళల ప్రాణాలు పోవడానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కుప్పానికి వచ్చాడని ప్రశ్నించారు. తన సభల్లో 11 మంది చనిపోయినా కూడా చంద్రబాబులో కించిత్ బాధ గానీ, పశ్చాత్తాపం గానీ కనిపించలేదని విమర్శించారు. అధికార దాహంతో చంద్రబాబు రాక్షసుడిగా వ్యవహరిస్తోన్నారంటూ పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు. ఎంతమంది ప్రాణాలు పోయినా ఫర్వాలేదని తనకు మాత్రం అధికారం కావాలని కోరుకుంటున్నాడని అన్నారు.












Click it and Unblock the Notifications