ఏలూరును రాజధాని చేయాలి: సుజాత, ఇబ్బందే: కేఈ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏలూరును చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు గనులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత బుధవారం తెలిపారు. ఆమె ఏలూరులో మాట్లాడారు. ఇసుక తవ్వకాలపై నూతన పాలసీ తీసుకోస్తామని తెలిపారు.
పిల్ల కాల్వలలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇసుక తవ్వకాల్లో నిబంధనలు అతిక్రమిస్తే పీడీపీపీ యాక్టు, ఐపీసీ 3, 7, 9 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా అధికారికంగా ఇసుక తవ్వకాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు.

రాజధాని కోసం భూసేకరణలో ఇబ్బందులు తప్పవు: కేఈ
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూసేకరణలో ఇబ్బందులు తప్పవని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వేరుగా అన్నారు. 55-45 శాతంలో భూసేకరణ చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. స్మార్ట్ సిటీల కోసం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడుతున్నారని చెప్పారు. గుంటూరు - కృష్ణా జిల్లాల మధ్యే రాజధాని అనుకున్నామన్నారు. అయితే, ఇంకా ఎక్కడనేది నిర్ధారణ కాలేదన్నారు. రైతురుణమాఫీపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామన్నారు.
ప్రతి ఏటా డీఎస్సీ: గంటా
ఇక నుండి ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. డీఎస్సీకి టెట్ రద్దు చేసే యోచనలో ఉన్నామని ఆయన చెప్పారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై రెండు రాష్ట్రాలు చర్చించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే విద్యార్థులు నష్టపోతున్నారన్నారు.












Click it and Unblock the Notifications