హోదాపై నమ్మకం: సుజాత, 3 గ్రామాల్ని దత్తత తీసుకున్న మిత్సుబిషి
హైదరాబాద్: కేంద్రమంత్రులు ప్రత్యేక హోదా పైన కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఇంకా నమ్మకం పెట్టుకున్నారు. మంత్రి పీతల సుజాత గురువారం మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.
బంగారు తల్లి పథకంలో సవరణలు చేసి దానిని మా ఇంటి మహాలక్ష్మిగా మారుస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను కార్పోరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. మహిళల రక్షణ కోసం విజయవాడ, విశాఖ, తిరుపతిలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
అర్హులందరికీ పెన్షన్లు: పల్లె
ఏపీని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతోనే చంద్రబాబు నాయుడును ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరిగాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టకున్నా బిల్లులు తీసుకున్నారన్నారు.
స్మార్ట్ విలేజ్ ప్రారంభించిన చంద్రబాబు
స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. స్మార్ట్ విలేజ్లు, రాజధాని నిర్మాణానికి జపాన్ సహకరిస్తుందని చెప్పారు. పట్టణాలకు ధీటుగా గ్రామాలను తీర్చిదిద్దుతామన్నారు.
పట్టణాల్లోని సౌకర్యాలన్నీ పల్లెసీమల్లోనూ రావాలన్నదే తమ ఆంకాంక్ష అన్నారు. జపాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ మిత్సుబిషి కృష్ణా జిల్లాలో మూడు గ్రామాలను దత్తత తీసుకుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఆకర్షణీయ గ్రామాల కింద మిత్సుబిషి సంస్థ మూడు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. జపాన్, భారత్ మధ్య సాంస్కృతిక సంబంధాలు చురుకుగా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో జపాన్ భాషను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మిత్సుబిషి సంస్థ, ఎం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ సంయుక్తంగా నాలి, సొర్లసొంది, మంగళాపురం గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడం సంతోషమన్నారు.