పెగాసస్ పై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం : నాటి నిఘా -చంద్రబాబును ఫిక్స్ చేస్తారా : సభా వేదికగా..!!
ప్రత్యర్ధుల ఫోన్ల పై నిఘా కోసం వినియోగించే పెగాసస్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారానికి కారణమవుతోంది.పెగాసస్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. శాసనసభా వేదికగా దీని పైన ప్రభుత్వం ప్రకటనకు సిద్దమైంది. ఏపీలో నాలుగు రోజులుగా పెగాసస్ అంశం రాజకీయంగా ప్రకంపనలకు కారణమైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదస్పద పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయాలంటూ తన వద్దకు వచ్చారని ..తాను తరిస్కరించానని చెబుతూనే.. నాటి ఏపీ సీఎం చంద్రబాబు దానిని కొనుగోలు చేసారంటూ వ్యాఖ్యానించారు.
దీని పైన టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. పెగాసస్ స్పై వేర్ ను తమ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని స్పష్టం చేసారు. తాము అ సాఫ్టవేర్ కొనుగోలు చేసి ఉంటే.. జగన్ అధికారంలోకి ఎలా వచ్చేవారని ప్రశ్నించారు.
మమతా వ్యాఖ్యలతో కలకలం
మమతా బెనర్జీ సమాచార లోపంతో అలా వ్యాఖ్యానించి ఉంటారని చెప్పుకొచ్చారు. తాము కొనుగోలు చేసి ఉంటే..అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని అంశాల పైన విచారణ చేయిస్తున్న జగన్..ఇప్పటి వరకు దీని పైన చర్యలు తీసుకోకుండా ఉంటారా అని లోకేష్ ప్రశ్నించారు. ఇక, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ 2021 లో ఏపీలో పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదంటూ సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానాన్ని టీడీపీ నేతలు బయట పెట్టారు.
దీని ద్వారా అసలు ఆ సాఫ్ట్ వేర్ తాము కొనుగోలు చేయలేదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమ ఫోన్లు ట్యాప్ చేసారంటూ అప్పట్లోనే సజ్జల ఆరోపించారు. ఇక, తాజాగా అంబటి..ఆర్కే వంటి నేతలు సైతం ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర తేల్చాలని డిమాండ్ చేసారు.
సభలో ప్రభుత్వం ఏం తేల్చనుంది
ఇప్పుడు, సభలో టీడీపీ కల్తీ సారా అంశం పైన ఆందోళన చేస్తున్న సమయంలో శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన సభలో కీలక ప్రతిపాదన చేసారు. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన పెగాసస్ వ్యవహారం పైన సుప్రీంకోర్టు ఒక కమిటీతో విచారణ చేయిస్తున్న విషయాన్ని గుర్తు చేసారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మమతా బెనర్జీ..మరో రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎటువంటి సమాచారం లేకుండా ఎందుకు వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు.
దీని పైన సభలో చర్చ చేపట్టి.. ఏం జరిగిందనే అంశం పైన పూర్తి స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. దీని పైన సభలో చర్చ చేపట్టి.. సుప్రీం సూచనల మేరకు విచారణ చేస్తున్న కమిటీకి అసెంబ్లీ ద్వారా రిఫర్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. దీని పైన ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి నోటీసు ఇచ్చినట్లు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
Recommended Video
చంద్రబాబు హయాంలో ఏం జరిగింది
దీంతో..ఈ రోజు ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత పెగాసస్ అంశం పైన చర్చకు తీసుకుంటామని స్పీకర్ ప్రకటించారు. ఈ చర్చ సమయంలో ప్రభుత్వం పూర్తిగా మాజీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, డీజీపీగా పని చేసిన అధికారి అసలు రాష్ట్రంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదంటూ చెప్పిన సమయంలో..ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
చంద్రబాబు హాయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వేంకటేశ్వర రావు పైన అప్పట్లోనే వైసీపీ నేతలు ఆరోపణలు చేసారు. ఇక, ఇప్పుడు సభలో ఈ అంశం పైన జరిగే చర్చ.. ప్రభుత్వం వెల్లడించే విషయాలు..తీసుకోబోయ నిర్ణయాలు రాజకీయంగా ఉత్కంఠకు కారణమవుతున్నాయి.