అవసరం లేకున్నా పెన్షన్లు ఇంటికి- అవసరమైన రేషన్ మాత్రం షాపుల వద్దే-ఏపీ సర్కారు తీరుపై విమర్శలు..
ఏపీలో ఇవాళ్టి నుంచి రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభమైంది. అయితే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో పేద ప్రజలకు రేషన్ డీలర్ల వద్దే సరుకులు ఇవ్వడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. గతంలో అడక్కముందే పింఛన్లను ఇంటివద్దకే పంపిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ ను మాత్రం షాపులకు వచ్చి తీసుకోవాలనడం సరికాదనే వాదన వినిపిస్తోంది. అయితే వాలంటీర్లను వివిధ పనులకు వాడుకుంటున్నందున ప్రజలకు ఇళ్లవద్దే రేషన్ పంపిణీ సాధ్యం కాలేదని తెలుస్తోంది.

ఏపీలో ఇళ్ల వద్దకే పింఛన్లు..
ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక కింద లక్షలాది మంది పేదలకు ఇళ్ల వద్దే పింఛను అందేలా కొన్ని నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేస్తోంది. వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే పింఛను అందించేలా వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమైనా అధిక శాతం మంది వృద్ధులకు, వికలాంగులకు ఇంటివద్దే పింఛను ఇవ్వడంలో తప్పేమీ లేదనే భావించారు. ఈ పథకం ప్రారంభించిన ప్రభుత్వం ప్రతీ నెలా ఒకటో తేదీన కచ్చితంగా ఇళ్లకు వాలంటీర్లు వచ్చి మరీ పించన్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఒకటో తేదీ ఆదివారమైనా పింఛను మాత్రం ఠంచనుగా అందేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూల ఫలితాలతో పాటు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది.

రేషన్ మాత్రం షాపుల వద్దే..
గతంలో నెలవారీ పెన్షన్ ను ఇంటివద్దే అందించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో అదే వాలంటీర్లను వాడుకుని ఇంటివద్దకే రేషన్ పంపుతుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. వాలంటీర్ల ద్వారా ఇళ్లకు పంపాల్సిన రేషన్ సరుకులను షాపుల వద్దే తీసుకోవాలని అధికారులు సూచించడంతో ఇవాళ పేద ప్రజలు డీలర్ల వద్ద క్యూలో కనిపించారు. అసలే కరోనా భయాలు, సామాజిక దూరం పాటించాలన్న హెచ్చరికలు, అలాగని ఇంటివద్దే ఉండిపోతే రేషన్ దొరకదేమో అన్న భయం, ఒక్క రోజులో సరుకులు దొరుకుతాయో లేదో అన్న ఆందోళన.. ఇలా అనేక భయాలతో ప్రజలు ఇవాళ రేషన్ డీలర్ షాపుల వద్దకు చేరుకుని సరుకులు తీసుకోవడం కనిపించింది.

అప్పుడలా.. ఇప్పుడిలా.. ఎందుకిలా.. ?
గతంలో నెలవారీ సామాజిక పెన్షన్లను ఇంటివద్దే ఇవ్వాలని ఎవరూ కోరలేదు. ఒకటో తేదీ ఆదివారం వచ్చినా అదే రోజు ఇవ్వాలని ఎవరూ అడగలేదు. కానీ ప్రభుత్వం మాత్రం లక్షలాది వాలంటీర్లను మోహరించి ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఒకే రోజు రికార్డు స్దాయిలో పెన్షన్లను ఇంటివద్దకే పంపింది. కానీ ఇప్పుడు కరోనా పరిస్ధితుల్లో ప్రజలు ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్దితి లేదు. లాక్ డౌన్ కొనసాగుతోంది. తప్పనిసరైతే తప్ప బయటికి వచ్చే పరిస్దితి లేదు. అయినా వాలంటీర్లను వాడుకోకుండా ప్రజలను రేషన్ కోసం షాపుల వద్ద క్యూ కట్టాలని ప్రభుత్వం సూచించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదన్న కారణంతో ఉదయం షాపింగ్ సమయాలను కూడా తగ్గించిన ప్రభుత్వం.. ఇప్పుడు రేషన్ కోసం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వారిని రేషన్ దుకాణాల వద్ద క్యూల్లో ఉండాలనడం సరికాదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

వాలంటీర్లు అందుబాటులో లేరా ?
ప్రస్తుతం ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రభుత్వం కేటాయించిన కరోనా ఇంటింటి సర్వేలో బిజీగా ఉన్నారు. విదేశీయుల లెక్కను సత్వరం తేల్చడం ద్వారా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్యపై ఓ అంచనాకు రావాలని భావిస్తున్న ప్రభుత్వం వాలంటీర్లు, ఆశా వర్కర్ల సాయంతో ఇంటింటి సర్వే సాగిస్తోంది. ఈ సర్వే తొలి దిశ విజయవంతమై పలువురు విదేశీ ప్రయాణికులు, కరోనా బాధితుల వివరాలు తెలియడంతో ఇప్పుడు రెండో దశను కొనసాగిస్తోంది. దీన్ని ఇప్పటికిప్పుడు వాయిదా వేయడం కుదరదు. అందుకే వాలంటీర్లను రేషన్ పంపిణీలో వాడటం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications