అందుకే తెరాస ఎమ్మెల్యేల్ని రానివ్వట్లేదు, ఆ ముగ్గురి ప్లాన్ అదే: చంద్రబాబు
అమరావతి/విజయవాడ: కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం మండిపడ్డారు. రాష్ట్రానికి న్యాయం కొరకు ధర్మపోరాట దీక్ష చేస్తున్నానని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైయస్ జగన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కుల, మతాలతో సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.
వదల బొమ్మాలీ వదలనంటున్న చంద్రబాబు, ఆయనది పొరుగు రాష్ట్రం: కేసీఆర్
అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని రానివ్వట్లేదు
పోలవరం నుంచి జూన్ నెలలో గ్రావిటీతో నీళ్లు అందిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటి ఎద్దడి లేకుండా చేస్తామని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు తమ నియోజకవర్గానికి రానివ్వని పరిస్థితి నెలకొందని, అందుకు ఆ పార్టీ స్వయంకృపరాధమే అన్నారు. నిత్యం అందుబాటులో ఉంటే ప్రజల నుంచి తిరస్కారం ఉండేది కాదని పార్టీ నేతలతో చెప్పారు.
నాతో సహా ఎవరికీ మినహాయింపు లేదు
తాను టీడీపీ కుటుంబ పెద్దను మాత్రమేనని చంద్రబాబు చెప్పారు. ప్రజా సేవ విషయంలో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదననారు. సమర్థంగా పని చేసినంత వరకు ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని తెలిపారు. ఈ అయిదేళ్లలో అనేక మందికి పదవులు ఇచ్చామన్నారు. భవిష్యత్లో ఇంతకు మించి పదవులు వస్తాయని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీల బాధ్యులు ఇందులో పాల్గొన్నారు.
పవన్, కేసీఆర్, జగన్ అజెండా అదే
కలెక్షన్ బ్యూరోగా బీజేపీ సీబీఐని మార్చేసిందని చంద్రబాబు అన్నారు. సీబీఐలో పీఎంవో జోక్యంపై ఆ శాఖ అధికారే వెల్లడించారన్నారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన ఒకే తానులో గుడ్డలన్నారు. జగన్, కేసీఆర్, పవన్ అజెండా ఒక్కటేనని, ఈ ముగ్గురూ మోడీని విమర్శించరని, టీడీపీనే వారి లక్ష్యమని చెప్పారు. బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి రాకుండా చేయాలనేదే వీళ్ల అజెండా అన్నారు.
అధికారం ప్రజా కూటమిదే: లోకేష్
తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని మంత్రి నారా లోకేష్ వేరుగా చెప్పారు. తెరాస, వైసీపీ, జనసేనలు ఒక్కటయ్యాయని విమర్శించారు. తెరాస, బీజేపీకి రహస్య ఒప్పందం ఉందని తెలిపోయిందని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే కూకట్పల్లిలో నందమూరి సుహాసిని తరఫున ప్రచారానికి వెళ్తానని చెప్పారు. అన్ని పార్టీల నేతలు తమ తమ ఆస్తులను ప్రకటించాలని లోకేష్ అన్నారు. ఎన్డీయే టీడీపీ నుంచి బయటకు వచ్చాక పవన్ కళ్యాణ్ తమపై యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీనిఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. కోడి కత్తి పేరుతో వైయస్ జగన్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.