సిఎం కావాలని కోరుతున్నారు: కెసిఆర్, బాబు ఓ శని

టిఆర్ఎస్ ముఖ్యమంత్రి పదవి అడిగితే తప్పేముందని కెసిఆర్ అన్నారు. ఖచ్చితంగా సిఎం పదవి అడుగుతామని, టిఆర్ఎస్ పార్టీకే ఆ అర్హత ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండవని, ఒంటరిగానే బరిలో దిగుతామని కెసిఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు మించి రావని అన్నారు. టిఆర్ఎస్ మేనిఫెస్టోలో అన్ని కీలకాంశాలు ప్రస్తావించామని కెసిఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కెసిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఓ పెద్ద శని అని దుయ్యబట్టారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. టిడిపి, భారతీయ జనతా పార్టీల పొత్తులు తుస్సుమంటాయని ఎద్దేవా చేశారు.
టిఆర్ఎస్ రెండో జాబితాను రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని కెసిఆర్ అన్నారు. సామాజిక కోణంలోనే టికెట్ల కేటాయింపు జరిగిందని తెలిపారు. కాగా, పదేళ్ల తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా కెసిఆర్ పోటీ చేస్తుండటం గమనార్హం.
టిఆర్ఎస్ పార్టీలో చేరిన బాజిరెడ్డి గోవర్ధన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కెసిఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. రైతులకు మేలు చేయడంలో కాంగ్రెస్, టిడిపిలు విఫలమయ్యాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు.
సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, విద్యా ఉద్యోగావకాశాల కల్పన చేపట్టనున్నట్లు కెసిఆర్ చెప్పారు. తెలంగాణలో విద్యుత్ సమస్య లేకుండా చేసి రైతుల పంటలకు ఢోకా లేకుండా చేస్తామని తెలిపారు. రూ. 3లక్షలతో, 125 గజాల స్థలంలో పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన వారే అధికారంలోకి రావాలని అన్నారు. విభజన తర్వాత కూడా ఆంధ్రా పార్టీల ఆధిపత్యం కావాలా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మూడింట రెండొంతుల మెజార్టీతో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications