పురంధేశ్వరిపై పెప్పర్ స్ప్రే: బాలకృష్ణపై రాళ్ల దాడి
చిత్తూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని చిత్తూరు జిల్లా సోమల మండలంలో జరిగిన రోడ్డు షోలో బిజెపి లోకసభ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిపై అభిమానులు పూలవర్షం కురిపించారు. గుంపులో చేరిన కొందరు దుండగలు పూలలో పెప్పర్ స్ప్రే కలిపి ఆమెపై చల్లడంతో పురంధేశ్వరి సహా పక్కనేవున్న తెలుగుదేశం పార్టీ నేతలు కొంత సమయం ఊపిరాడక ఇబ్బందిపడ్డారు.
సెక్యురిటీ సిబ్బంది సపర్యలతో ఆమె కొంతసేపటికి తేరుకున్నారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ - ఆడబిడ్డగా రాయలసీమలోకి అడుగుపెడితే ఇలా అవమానపర్చడం భావ్యమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడికి పాల్పడిన వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గర పడిందని గద్గద స్వరంతో పిలుపునిచ్చారు.
ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సోమల బస్టాండ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. తెలిసీ తెలియక కొంత మంది సింహం జూలు పట్టుకుని ఆడుకుంటున్నారని, అటువంటివారి సంగతి మే 7వ తేదీన తెలుస్తుందని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి సునామీని ఎవరూ ఆపలేరని పురంధేశ్వరి అన్నారు. రాయలసీమ దాహార్తి తీరాలంటే కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఆమె అన్నారు.
ఇదిలావుంటే, అనంతపురం జిల్లా నార్పల నుంచి బుక్కరాయ సముద్రం వరకు నిర్వహించిన రోడ్ షోలో రేకులకుంట గ్రామం వద్ద హిందూపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ కాన్వాయ్పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో బాలకృష్ణకు ఏ విధమైన ప్రమాదం జరగలేదు. పోలీసులు అప్రమత్తం కావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పారిపోయారు.